కొవిడ్ పరిస్థితుల కారణంగా భారత్లో చాలా మంది పిల్లలకు సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదన్న వార్తలపై కేంద్రం స్పందించింది. పిల్లలకు టీకా అందించే విషయంలో కరోనా భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తాము కలిసి పనిచేశామని స్పష్టం చేసింది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద అందరూ టీకా తీసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొంది. భారత్లో 35 లక్షల మందికి సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదని యూనిసెఫ్ వెల్లడించిన ఒక్కరోజు తర్వాత కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
"ఈ నివేదికల్లో ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవాలేంటో వీటిలో కనపడట్లేదు. మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ సహా అత్యవసర సేవలను అందించడంలో మేం దృష్టి సారించాం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, అభివృద్ధి భాగస్వాములతో కలిసి కొవిడ్ భయాలను తొలగించి, పిల్లలు తప్పనిసరిగా టీకా తీసుకునేలా కార్యక్రమాలు చేపట్టాం."
-కేంద్ర ఆరోగ్య శాఖ