తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2021, 9:19 PM IST

Updated : Jul 28, 2021, 10:26 PM IST

ETV Bharat / bharat

ఉత్తరాదిన వరద బీభత్సం- పెరుగుతోన్న మరణాలు

భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు రాష్ట్రాల్లో జల విలయం సృష్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదల ధాటికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. 25 మందికిపైగా గల్లంతయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ వరదలు విలయ తాండవం చేస్తున్నాయి. హిమాచల్‌లో తొమ్మిది మంది చనిపోగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. అటు ఉత్తరాఖండ్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మరణాలపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Extremely Heavy Rains in north india
ఉత్తరాదిన వరద బీభత్సం

జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా సంభవించిన వరదల ధాటికి 9 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని మరో 12 మందికి గాయాలయ్యాయని ఎస్​డీఆర్​ఎఫ్​ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారని వెల్లడించారు. ఆకస్మిక వరదలు గులాబ్‌గఢ్‌ గ్రామాన్ని ముంచెత్తాయని వివరించారు. పోలీసులు, సైన్యం, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదల వల్ల 9 ఇళ్లు కొట్టుకుపోయాయని గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. శిధిలాల కింద చిక్కుకున్న 5 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో రెండు గ్రామాలను వరదలు ముంచెత్తాయని కానీ ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.

జమ్ములో వరద ప్రవాహం
జమ్ముకశ్మీర్‌ వరదలకు కొట్టుకుపోయిన కొండచరియలు

ఎడతెరిపిలేని వానలు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల జమ్మూకశ్మీర్‌లోని పద్దర్ ప్రాంతం నుంచి 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని కిష్టావర్ జిల్లా పరిపాలన యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌, డీజీపీని అడిగి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరిన్ని ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలికి వెళ్తున్నాయని ట్వీట్‌ చేసిన అమిత్ షా..వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటమే తమ ప్రాధాన్యత అన్నారు. ప్రజలను రక్షించేందుకు ఎస్​డీఆర్​ఎఫ్​, ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయని జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్ సిన్హా తెలిపారు.

ఉత్తరాఖండ్​లో నీటిలో చిక్కుకున్న కారు

హిమాచల్​ప్రదేశ్​లోనూ అదే పరిస్థితి..

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఆకస్మిక వరదలు కల్లోలం సృష్టించాయి. వరదల్లో ఇప్పటి వరకూ తొమ్మిది మంది చనిపోగా, మరో ఏడుగురు గల్లంతయ్యారని ఎస్​డీఆర్​ఎఫ్​ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కులు జిల్లాలోని ఓ జలవిద్యుత్‌ కేంద్రం వద్ద మహిళ సహా నలుగురు, లాహాల్-స్పితి జిల్లాలో ముగ్గురు చనిపోయారని ఎస్​డీఆర్​ఎఫ్​ డైరెక్టర్ సుదేష్ కుమార్ తెలిపారు. లాహౌల్-స్పీతి జిల్లాలో సంభవించిన వరదల్లో పది మంది గల్లంతయ్యారు. లాహౌల్‌కు వచ్చే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. సిమ్లాలో వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక జారీ చేసింది. కులులో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తిందని ఎస్​డీఆర్​ఎఫ్​ తెలిపింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి.

వరదలో కొట్టుకుపోతున్న వాహనం
ఉత్తరాదిలో పోటెత్తిన వరద

ఉత్తరాఖండ్​లోనూ వరద విలయం..

ఉత్తరాఖండ్‌లోనూ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు నదీ జలాలు దెహ్రాదూన్‌లోని తప్‌కేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలోకి ప్రవేశించాయి. గంగోత్రిలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

ఉత్తరాఖండ్​లో వరద వెల్లువ

ఇదీ చూడండి:మహారాష్ట్రలో వరద బీభత్సం- 209కి చేరిన మృతులు

Last Updated : Jul 28, 2021, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details