దేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాల కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
"2014 యూపీఏ హయాంలో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్పై రూ.9.20, డీజిల్పై రూ.3.46 మాత్రమే ఉంది. కానీ, మోదీ ప్రభుత్వంలో ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోల్పై రూ.32.90, డీజిల్పై రూ.31.80 భారీగా విధిస్తోంది. కేంద్రం ఈ మేర సుంకాలు విధించడం కారణంగా సామాన్యుడు బలవుతున్నాడు. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎక్సైజ్ సుంకాలను వెంటనే తగ్గించాలి. గత 11 రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలతో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలే ఇందుకు కారణం. దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేంద్రం రాష్ట్రాలపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీల భారం మోపుతోంది. ఫలితంగానే రాష్ట్రాలు ప్రజలపై వ్యాట్ విధించాల్సి వస్తోంది."
--- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి