Rahul Gandhi Bharat Nyay Yatra :బీజీపేకి వ్యతిరేకంగా దేశప్రజలందరినీ ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ- ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్ర పేరుతో మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు 'ఈ యాత్ర' చేపట్టనున్నట్లు కాంగ్రెస్ బుధవారం వెల్లడించింది. 2024 జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు భారత్ న్యాయ యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
మణిపుర్ నుంచి ముంబయి వరకు
2024 జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు 'భారత్ న్యాయ యాత్ర' నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. భారత్ న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. సబ్కే లియో న్యాయ్ అనేది ఈ యాత్ర సందేశమని వెల్లడించారు. భారత్ న్యాయ యాత్రలో యువత, మహిళలు, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
14 రాష్ట్రాల్లో జరగనున్న యాత్ర
మణిపుర్ నుంచి భారత న్యాయ యాత్ర మొదలై అసోం, మేఘాలయ, బంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ భారత న్యాయ యాత్ర జరుగుతుంది. అయితే, భారత్ జోడో యాత్రలా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈ సారి బస్సు యాత్ర కూడా చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. మధ్యమధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని ఆయన తెలిపారు.