రాజపథ్లో అట్టహాసంగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు రఫేల్ యుద్ధ విమాన ప్రదర్శనతో ముగిశాయి. గంటకు 900కిమీల వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన ఈ యుద్ధవిమానం భారత వైమానిక శక్తిని మరోమారు చాటిచెప్పింది. కెప్టెన్ హర్కిరత్ సింగ్ పైలట్గా వ్యవహరించారు.
గణతంత్ర వేడుకల్లో రఫేల్ ప్రదర్శన
11:51 January 26
11:22 January 26
'ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్: కొవిడ్' ఇతివృత్తంతో బయో టెక్నాలజీ విభాగం గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించింది. కరోనా టీకా అభివృద్ధి చేసిన చేసిన ప్రక్రియను వర్ణించింది.
11:16 January 26
రాజ్పథ్ గణతంత్ర వేడుకల్లో అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర శకటాన్ని ప్రదర్శించారు. ఉత్తర్ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.
11:09 January 26
గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబించేలా మోధెరాలోని సూర్యదేవాలయం శకటాన్ని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. సూర్య దేవాలయంలో భాగమైన సభమండప్.. 52 స్తంభాలు సౌర సంవత్సరంలో 52 వారాలను సూచిస్తాయి.
10:57 January 26
రాజ్పథ్లో నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాతం లద్ధాఖ్ సంస్కృతి, మత సామరస్యం, కళ, భాషలు, మాండలికాలు, సాహిత్యం, సంగీతాన్ని ప్రతిబింబించే శకటం ప్రదర్శించారు. కేంద్రపాలిత ప్రాంతం శకటాన్ని ప్రదర్శించటం ఇదే తొలిసారి.
10:55 January 26
గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజ్పథ్ పరేడ్లో సరిహద్దు భద్రతా దళం ఒంటెలతో కవాతు నిర్వహించింది.
10:50 January 26
మహారాష్ట్రలోని ఎన్సీసీ డైరెక్టరేట్ సీనియర్ అండర్ ఆఫీసర్ సమృద్ధి హర్షల్ సంత్ నేతృత్వంలో ఎన్సీసీ బాలికలు రాజ్పథ్లో కవాతు నిర్వహించారు.
10:06 January 26
72వ గణతంత్ర వేడుకల్లో భాగంగా దిల్లీలోని రాజ్పథ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో పాటు ఉన్నారు.
10:03 January 26
72 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
10:01 January 26
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
09:52 January 26
రిపబ్లిక్ డే సందర్భంగా దిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.
09:21 January 26
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తన నివాసంలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
09:17 January 26
మధ్యప్రదేశ్ రీవాలోని ఎస్ఏఎఫ్ మైదానంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జాతీయ జెండా ఎగురవేశారు.
09:09 January 26
బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
09:00 January 26
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
08:58 January 26
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా గవర్నర్ గణేశి లాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆయనతో పాటు ఉన్నారు.
08:48 January 26
లద్దాఖ్లో పర్వత ప్రాంతంలోని బోర్డర్ అవట్పోస్ట్ వద్ద 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు ఐటీబీపీ జవాన్లు. అతిఎత్తయిన మంచు పర్వతాలపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
08:45 January 26
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
08:24 January 26
లైవ్ అప్డేట్స్ : గణతంత్ర వేడుకల్లో రఫేల్ ప్రదర్శన
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర వేడుకలను నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల 25 నిమిషాల వరకూ దిల్లీలో వేడుకలు జరగనున్నాయి. ఈసారి గణతంత్ర వేడుకల్లో తొలిసారి రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొనబోతున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు రాజ్పథ్లో జరిగే వేడుకకు 25 వేల మంది ఆహూతులను మాత్రమే అనుమతించనున్నారు.
దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జయపురలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా..తమిళనాడులో భన్వరిలాల్ పురోహిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. భారత్కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం నిర్మించిన రాజ్యాంగం అసాధారణమైనదని కొనియాడారు. త్వరలోనే భారత్లో పర్యటించాలన్న తన ప్రణాళికను పునరుద్ఘాటించారు.
పటిష్ఠ భద్రత..
గణతంత్ర వేడుకలకు దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. రాజ్పథ్ పరిసరాలతో పాటు నగర సరిహద్దుల వద్ద సాయుధ బలగాలకు చెందిన వేలాది మంది సిబ్బంది పహార కాస్తున్నట్లు చెప్పారు. నిఘా కోసం సుమారు 6 వేల మంది భద్రత దళాల సిబ్బందిని రంగంలోకి దించారు. అనుమానితులను గుర్తించేందుకు వీలుగా 30 కీలక ప్రాంతాల్లో ముఖ కవళికలను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు.దాని డేటాబేస్లో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, నేరస్తులు సహా 50 వేల మంది వివరాలను పొందుపర్చారు. రాజ్ పథ్ నుంచి గణతంత్ర కవాతు సాగే 8 కిలోమీటర్ల మార్గంలో.. ఎత్తైన భవనాలపై నుంచి షార్ప్ షూటర్లు, స్నైపర్లు పటిష్ట నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. దిల్లీలో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కర్నాల్ బైపాస్ రహదారిపై పోలీసులు తాత్కాలిక గోడ నిర్మించారు. దిల్లీలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.