తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2023, 7:30 PM IST

ETV Bharat / bharat

అనాథ శవాలకు అంత్యక్రియలు.. బాడీబిల్డర్ సామాజిక సేవ.. బాలికలకు సెల్ఫ్​డిఫెన్స్ నేర్పిస్తూ..

పంజాబ్​కు చెందిన ఓ యువతి ఎవరూ చేయని సాహసమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా అనాథ శవాలను తన సొంత ఖర్చులతో దహనం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేగాక ఆడపిల్లలకు ఆత్మరక్షణలో మెలకువలు నేర్పిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Punjabi Lady Poonam Pathaani Story
పంజాబీ యువతి పూనమ్ పఠానీ

సాధారణంగా మహిళలు శ్మశానవాటికలకు రాకూడదు అని చెబుతుంటారు పెద్దలు. స్త్రీలు ఈ కార్యానికి ఎందుకు దూరంగా ఉండాలనే కారణం కూడా చాలామందికి తెలియదు. కానీ పంజాబ్​లోని లూథియానాకు చెందిన పూనమ్​ పఠానీ అనే బాడీబిల్డర్ మాత్రం గుర్తుతెలియని మృతదేహాలకు తన సొంత డబ్బులతో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా వందకు పైగా డెడ్​బాడీలకు తన సొంత డబ్బులతో అంత్యక్రియలు చేశారు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈమె మానవసేవయే మాధవ సేవ అంటూ మృతదేహాలకు కర్మకాండలు చేయడమే కాకుండా తన జీవనోపాధి కోసం ఆడపిల్లలకు ఆత్మరక్షణలో శిక్షణ కూడా ఇస్తున్నారు. తాను చేసే పనిని ఇలాగే కొనసాగిస్తానని చెబుతున్నారు పూనమ్​.

అనాథ మృతదేహానికి కర్మకాండలు నిర్వహిస్తున్న పూనమ్​​ పఠానీ

మృతదేహాల దహనసంస్కారాలు చేయడానికి ఏ సేవా సంస్థ సహాయాన్ని ఆశించకుండా తన సొంత ఖర్చులతో ఈ సేవ చేస్తున్నారు పూనమ్​. ఈ సేవ చేయడానికి ప్రధానమైన కారణం తనకు ప్రమాదం జరగడమేనని పూనమ్​ చెబుతున్నారు. 2019లో జరిగిన ఓ ప్రమాదంలో పూనమ్​ తన కాలును కోల్పోయారు. ఆపరేషన్​ చేసి కాలును తొలగించాలని వైద్యులు చెప్పినా ఆమె అందుకు నిరాకరించారు. అనంతరం మూడు నాలుగు సర్జరీల తర్వాత కూడా ఆమె కోలుకోలేకపోయారు. దీంతో ఆమె వీల్‌చైర్​కే పరిమితమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రతిరోజూ జిమ్​ చేసి క్రమంగా కోలుకుంటూ నిలబడటం ప్రారంభించారు పూనమ్.

అనాథ శవానికి దహనసంస్కారాలు చేస్తున్న పూనమ్​ పఠానీ

కొవిడ్​ నుంచే ప్రారంభించా..
ముఖ్యంగా కొవిడ్​ విజృంభణ సమయంలో ఈ దహన కార్యక్రమాల సేవను ప్రారంభించానని తెలిపారు పూనమ్. 'జిమ్​కు వచ్చే నా స్నేహితురాలి తండ్రి చనిపోయారు. అప్పుడు నేను ఆయన్ని చూడటానికి శ్మశానానికి వెళ్లాను. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న అనాథ మృతదేహాలను దహనం చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదని గమనించా. అప్పుడు నేనే నా సొంత డబ్బులతో ఆ మృతదేహాల దహన కార్యక్రమాలను పూర్తి చేశా. అలా ప్రతి నెలా 3 నుంచి 4 అనాథ శవాలను దహనం చేయడం ప్రారంభించా. నా జిమ్‌కు వచ్చే ఆడపిల్లలు కూడా ఈ సేవలో నాకు సహకరిస్తున్నారు' అని పూనమ్​ తెలిపారు.

జిమ్​లో పూనమ్ కసరత్తులు

'డ్రగ్స్ కోరల్లో నుంచి యువత బయటపడాలి'
అంతేగాక పంజాబ్​ యువతను డ్రగ్స్ భూతం నుంచి దూరంగా ఉంచేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నారు పూనమ్​ పఠానీ. దీంతోపాటు రక్తదాన శిబిరాల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలస్తున్నారు. పాఠశాలల్లో పలు క్యాంపులు నిర్వహిస్తూ యువత డ్రగ్స్‌కు బానిసలవ్వకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. బాలికలను సామాజిక సేవలో భాగం చేయడం సహా వారికి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తున్నారు.

పూనమ్ కసరత్తులు

'ముఖ్యంగా పంజాబ్‌లోని యువతరం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. యువత మాదకద్రవ్యాల వినియోగం నుంచి బయటపడి మంచి దారిలో నడవాలంటే కేవలం జిమ్​, వ్యాయమం వంటివి మాత్రమే పరిష్కారం. మన ప్రభుత్వాలు వీటిపై కాకుండా కాంట్రాక్టులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం దురదృష్టకరం' అని పూనమ్ చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details