నెలకు పైగా నిరీక్షణ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాజ్నివాస్ వద్ద ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సహా ఇతరులు హాజరయ్యారు.
ఏఐఎన్ఆర్సీ నుంచి కె.లక్ష్మీ నారాయణన్, డీజే కౌమర్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా నుంచి నమశివయం, శరవణ కుమార్.. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పుదుచ్చేరి కేబినెట్లో భాజపా నేతలు చోటు దక్కించుకోవటం ఇదే తొలిసారి.
41 ఏళ్ల తర్వాత..
అయితే.. ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్ర ప్రియాంక సరికొత్త రికార్డు సృష్టించారు. 41 ఏళ్ల తర్వాత తొలిసారి మంత్రి పదవిని చేపట్టిన మహిళగా నిలిచారు. నెదుంగాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్ర ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మాజీ మంత్రి చంద్రకాశు కుమార్తె. చంద్ర ప్రియాంక కంటే ముందు దివంగత కాంగ్రెస్ నాయకురాలు, రేణుక అప్పాదురై పుదుచ్చేరిలో మంత్రి(1980-83)గా బాధ్యతలు నిర్వర్తించారు.