నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలకుపైగా దిల్లీ సరిహద్దులో ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు.. కుండ్లీ-మనేసర్-పల్వాల్(కేఎంపీ)/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించారు. సాగు చట్టాలు రద్దయ్యే వరకూ తమ పోరాటం ఆగదని మరోమారు తేల్చిచెప్పిన అన్నదాతలు.. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలను 24 గంటలపాటు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. అత్యవసర వాహనాలకు అనుమతినిస్తామని పేర్కొన్నారు.
"కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించాం. 24గంటలపాటు ఈ బంద్ కొనసాగనుంది. ఈ సమయంలో కేఎంపీ ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని హరియాణా పోలీసులు కోరారు."
- హరీందర్ సింగ్ లఖోవాల్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి