తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2021, 2:05 PM IST

Updated : Jun 9, 2021, 6:58 AM IST

ETV Bharat / bharat

ఆసుపత్రి 'ఆక్సిజన్​ డ్రిల్​'- 22 మంది మృతి?

అనుమతులకు మించి కొవిడ్​ రోగులను చేర్చుకున్న ఓ ఆసుపత్రి.. ఆక్సిజన్​ కొరత ఎదురవడం వల్ల వారిని పంపించేందుకు ఓ 'ప్రణాళిక' రచించింది. వారికి ఆక్సిజన్​ సరఫరాను కొద్దిసేపు నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఆసుపత్రి యజమానే చెప్పడం గమనార్హం. ఈ ఘటనలో 22 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Probe ordered on Agra hospital after doctor's 'oxygen drill' on patients
Agra hospital oxygen drill

'ఆక్సిజన్​ డ్రిల్'​ పేరుతో కొవిడ్​ రోగుల ప్రాణాలతో ఆడుకుంది ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఓ ఆసుపత్రి. సరఫరాను నిలిపివేసి.. ఆక్సిజన్​ కొరత ఉందని ఐదు నిమిషాల పాటు ఈ డ్రిల్​ చేసింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 22 మంది చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న జరిగిన ఈ ప్రణాళిక గురించి ఆసుపత్రి యజమాని వివరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వైరల్​ వీడియో

ఇదీ జరిగింది

ఆగ్రాలోని పరాస్​ ఆసుపత్రికి డా. అరింజయ్​ జైన్​ యజమాని. కరోనా కారణంగా గత ఏప్రిల్​ నెలలో ఆసుపత్రికి ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. తగిన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. 'మాక్​ డ్రిల్​' తరహాలో 'ఆక్సిజన్​ డ్రిల్​' నిర్వహించారు సిబ్బంది. ఆక్సిజన్​ సరఫరాను అర్ధంతరంగా నిలిపివేశారు.

"ఆ సమయంలో ఆక్సిజన్​ కొరత ఎక్కువగా ఉంది. మోదీనగర్​లో అసలు ఆక్సిజనే లేదు. 96మంది రోగులు ఉన్నారు. వారిని తీసుకెళ్లిపోవాలని వారి బంధువులను కోరాము. కానీ వారు నా మాట వినలేదు. అందుకే నేను ఓ మాక్​ డ్రిల్​ చేయాలనుకున్నా. ఏప్రిల్​ 26, ఉదయం 7 గంటలకు.. ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్​ సరఫరాను నిలిపివేశాము. ప్రాణవాయువు అందక 22మంది విలవిలలాడిపోయారు. వారి శరీరాల రంగులు కూడా మారిపోయాయి. ఆక్సిజన్​ లేకపోతే వారు బతకరని అర్థమైంది. ఐసీయూలోని మిగిలిన 74మంది రోగుల కుటుంబాలకు.. సొంతంగా ఆక్సిజన్​ సిలిండర్లు తెచ్చుకోవాలని ఆదేశించాము."

--- డా. అరింజయ్​ జైన్​

ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది పరిస్థితి విషమించింది. ఆ 22 మంది మృతి చెందారనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. పరాస్‌ ఆసుపత్రిలో ఏప్రిల్‌ 26న తన తాత చనిపోయారని ఆగ్రాలోని జీవన్‌ మండి ప్రాంత నివాసి మయాంక్‌ చావ్లా వెల్లడించారు. అదే రోజు ఎందరో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఆసుపత్రి

అయితే వీడియోలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు అరింజయ్​.

ఈ వ్యవహారంపై జిల్లా మెజిస్ట్రేట్​ దర్యాప్తునకు ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించి..

వాస్తవానికి పరాస్​ ఆసుపత్రిలో 45 కొవిడ్​ రోగుల చికిత్సకు మాత్రమే అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ 96మంది రోగులను చేర్చుకుంది. ఫలితంగా ఆసుపత్రిలో ఆక్సిజన్​ కొరత ఏర్పడటమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో కరోనా హాట్​స్పాట్​గా మారిపోయింది. ఈ వ్యవహారంపై అంటువ్యాధుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనను కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఖండించారు. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు.

రాహుల్​ ట్వీట్​

ఇదీ చూడండి:-Oxygen therapy: ఆక్సిజన్‌ అధికమైనా ప్రమాదమే

Last Updated : Jun 9, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details