జమ్ముకశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగహోదా రద్దు చేసిన ఏడాదిన్నర తర్వాత.. కశ్మీర్ భవిష్యత్తు నిర్ణయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా లోయలో పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుకొంటున్న ఆ ప్రాంత రాజకీయ పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)గా ఏర్పడిన కశ్మీర్ ప్రాంత ఏడు ప్రధాన రాజకీయపక్షాలతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయం పావులు కదుపుతున్నట్టు ఈ వర్గాల సమాచారం. కాంగ్రెస్, భాజపా రాష్ట్ర యూనిట్లు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశముంది.
విధివిధానాలు ఖరారు..
కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన జమ్ముకశ్మీర్లో వీలైనంత త్వరగా శాసనసభ ఎన్నికలు నిర్వహించేలా ఈ చర్చల విధివిధానాలు ఖరారు చేయడంలో పీఎంవో నిమగ్నమై ఉంది. ఈ మేరకు దిల్లీలో పీఏజీడీ నేతలతో ప్రధాని నిర్వహించే సమావేశంలో సరిహద్దుల నిర్ణయం, శాసనసభ ఎన్నికలు, 2019 ఆగస్ట్ 5న తొలగించిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రధాన చర్చనీయాంశాలయ్యే అవకాశముంది.