తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం- IPC, CrPC స్థానంలో భారతీయ చట్టాలు

President Assent To New Criminal Bills : మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు నేర న్యాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఆ బిల్లులు చట్టాలుగా మారాయి. మరోవైపు, కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లుకు సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

By PTI

Published : Dec 25, 2023, 7:30 PM IST

Updated : Dec 25, 2023, 9:30 PM IST

president assent to new criminal bills
president assent to new criminal bills

President Assent To New Criminal Bills :పార్లమెంట్ ఆమోదించిన నేర న్యాయ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లులు చట్టాలుగా మారినట్లైంది.

ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్​పీసీ), ఎవిడెన్స్ యాక్ట్​లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయగా బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. బిల్లులను సవరించి శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లులను గతవారం పార్లమెంట్ ఆమోదించి పంపగా తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్​లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు.

రాజద్రోహం కొత్త రూపంలో!
రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు. బ్రిటిష్ పాలకుడిని సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. 'రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు' పేరుతో కొత్త సెక్షన్​ను అమర్చారు. వేర్పాటు చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాతం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జీవితఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపర్చారు.

'బాధితులకు న్యాయం చేడడమే లక్ష్యం'
నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడమే కొత్త చట్టాల లక్ష్యమని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్​లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత బిల్లులను రూపొందించినట్లు తెలిపారు. సభ ఆమోదం కోసం తీసుకొచ్చే ముందు బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తాను పరిశీలించినట్లు షా వివరించారు.

టెలికాం బిల్లుకు సైతం ఆమోద ముద్ర
టెలికమ్యూనికేషన్స్ బిల్లుకు సైతం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వందేళ్ల నాటి టెలికాం చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. స్పెక్ట్రమ్ కేటాయింపు, వేలం లేకుండా శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలకు హక్కుల కల్పన వంటి నిబంధనలు ఇందులో చేర్చారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాన్ని తీర్చిదిద్దారు. యూజర్లకు మరింత రక్షణ కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో టెలికమ్యూనికేషన్లను తాత్కాలికంగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకునేలా నిబంధనలు రూపొందించారు.

'చట్టసభ్యులపై క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం వద్దు'- ప్రత్యేక బెంచ్​ల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

ADR Report On MPS Criminal Cases : 40 శాతం సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. YCP ఎంపీల్లో 13 మందిపై..

Last Updated : Dec 25, 2023, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details