తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెమ్​డెసివిర్​పై భాజపా 'జోక్యం'తో రాజకీయ రగడ!

రెమ్​డెసివిర్​ ఔషధంపై భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఔషధాన్ని నిల్వచేసి ఎగుమతి చేస్తోందనే ఆరోపణలతో బ్రూక్​ సంస్థపై ముంబయి పోలీసుల విచారణతో భాజపా, మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ప్రభుత్వం సరఫరా చేయాల్సిన ఔషధాన్ని భాజపా నిల్వచేస్తోందని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు మండిపడ్డాయి. అయితే కరోనా కోసం పోరాటం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా తిప్పికొట్టింది.

By

Published : Apr 20, 2021, 4:02 PM IST

remdesivir controversy
రెమ్​డెసివిర్ వివాదం

రెమ్​డెసివిర్ ఔషధ సరఫరాలో భారతీయ జనతా పార్టీ 'జోక్యం' చేసుకుంటోందన్న ఆరోపణ మహారాష్ట్ర, గుజరాత్​లలో తీవ్ర దుమారం రేపుతోంది. కరోనాపై పోరులో విషమంగా ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని ఇస్తారు. దేశీయ అవసరాల దృష్ట్యా రెమ్​డెసివిర్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇలాంటి సమయంలో దమన్​కు చెందిన బ్రూక్​ ఫార్మా సంస్థ 60 వేల రెమ్​డెసివిర్ వయల్స్​ను నిల్వచేసి, ఎగుమతి చేస్తోందన్న సమాచారంతో ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు. సంస్థ అధినేత రాజేశ్​ డొకానియాను శనివారం రాత్రి పోలీసులు ప్రశ్నించారు. మహారాష్ట్రలో రెమ్​డెసివిర్ సరఫరాపై ఈ సంస్థతో భాజపా సంప్రదింపులు జరుపుతోంది. దీంతో అది రాజకీయ రగడకు కారణమైంది.

డొకానియాను ప్రశ్నించడంపై హుటాహుటిన పోలీస్​స్టేషన్​కు చేరుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చౌకబారు రాజకీయం చేస్తోందని ఫడణవీస్ విమర్శించారు.

"కొవిడ్​పై పోరాటం జరుగుతోంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సిగ్గులేని చర్యలకు పాల్పడుతోంది. బ్రూక్​ ఫార్మా అధినేతను అదుపులోకి తీసుకున్నారు. ఆ సంస్థ అదివరకే మహారాష్ట్ర సర్కారు, దమన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ కూడా మహారాష్ట్రకు వీలైనన్ని ఎక్కువ వయల్స్​ అందించాలని సంస్థను కోరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది."

- ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ సీఎం

ప్రభుత్వానికి బదులు పార్టీ..

అయితే, రెమ్​డెసివిర్​ను ప్రభుత్వ యంత్రాంగమే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఔషధం కొరతపై పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతోన్న వేళ.. 'దానం' చేయడానికి ఒక పార్టీ హోదాలో భాజపా దానిని సేకరించిందన్న ఆరోపణ వివాదాస్పదంగా మారింది.

కొద్ది రోజుల క్రితం.. భాజపా గుజరాత్​ విభాగం రెమ్​డెసివిర్​ను ఉచితంగా పంచింది. మరో ఘటనలో నాగ్​పుర్​ కోసం సన్​ఫార్మా నుంచి 10 వేల వయల్స్​ను సేకరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెమ్​డెసివిర్​కు భారీ డిమాండ్​ నెలకొంది. దాని ఎగుమతిదారుల్లో భారత్​కు చెందిన బ్రూక్​ ఫార్మా అతిపెద్ద సంస్థ.

భాజపా తీరుపై అసహనం..

భాజపా జోక్యంపై మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ మండిపడ్డారు. పోలీసు విధుల్లో భాజపా కలుగజేసుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించబోయేది లేదన్న ఆయన.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు.

మానవత్వ వ్యతిరేక చర్య..

రెమ్​డెసివిర్​ కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. బాధ్యత గల హోదాలో ఉన్న వ్యక్తులు 'మానవత్వ వ్యతిరేక' చర్యలకు ఎలా పాల్పడతారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆక్షేపించారు.

ఫడణవీస్​పై శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేదీ కూడా విమర్శలు గుప్పించారు.

"చౌకబారు రాజకీయాల కోసం మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాకపోతే ఏమిటిది? రహస్యంగా సేకరించిన ఔషధాన్ని ప్రతిపక్ష నేత నిల్వచేస్తున్నారు. దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫడణవీస్ సిగ్గుపడాలి. మీ చీకటి కార్యకలాపాలు మరోసారి బహిర్గతమయ్యాయి."

-ప్రియాంక ఛతుర్వేదీ, శివసేన ఎంపీ

'మోదీ ప్రభుత్వ బెదిరింపులు..'

అంతకుముందు గుజరాత్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన ఓ లేఖను మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్ ట్వీట్​ చేశారు. అందులో మహారాష్ట్ర కన్నా గుజరాత్​కు అధికంగా రెమ్​డెసివిర్​ను సరఫరా చేసినట్లు ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి రుజువైందని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకోవడం కోసం మోదీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. ఇంజెక్షన్లను ఎగుమతి చేస్తే లైసెన్సులను రద్దు చేస్తామని ఎగుమతిదారులను భయపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా అవమానకరమని, దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఉద్ధవ్​ఠాక్రే అల్ప రాజకీయాలు..

రెమ్​డెసివిర్​పై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రే తీరును విమర్శించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. "ఈ సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకారంతో పనిచేయాలి. నిన్ననే సమీక్షలో ప్రధాని మోదీ చెప్పారు. కానీ, ఉద్ధవ్​ఠాక్రే అల్ప రాజకీయాలకు పాల్పడటం బాధాకరం. సిగ్గుమాలిన రాజకీయాలను ఆపి, ఆయన వెంటనే బాధ్యతలను తీసుకోవాలి. వారికి సరిపడా మెడికల్​ ఆక్సిజన్​ సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి డా.హర్షవర్ధన్ హామీఇచ్చారు." అని గోయల్ ట్వీట్ చేశారు.

ఇవీ చూడండి:

రెమ్‌డెసివిర్‌పై 'మహా' జగడం!

'రెమ్​డెసివిర్ అక్రమ నిల్వ పనిలో ఫడణవీస్'

'రెమిడె​సివిర్​ను బ్లాక్​లో అమ్మితే కఠిన చర్యలే'

ABOUT THE AUTHOR

...view details