Police Attack on Soldier in Anakapalli District: ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైౖఫిల్ క్యాంపులో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సుకోసం వేచిఉండగా అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభారాణి.. దిశ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో సయ్యద్ అలీముల్లా ఫోన్లోనూ డౌన్లోడ్ చేయించారు. అయితే వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. మీ బ్యాడ్జిలపై పేర్లు లేవు. నాకు అనుమానం కలుగుతోంది.. మీ గుర్తింపు కార్డుల్ని చూపించాలని అలీముల్లా పోలీసుల్ని కోరారు.
Lawyers strike: నల్లకోటుపై లాఠీ.. ఆందోళనలో న్యాయ సమాజం
వేసుకున్న పోలీస్ డ్రెస్ కనిపించడం లేదా.. స్టేషన్కొస్తే గుర్తింపు కార్డుల్ని చూపిస్తామని కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. తర్వాత ఓ కానిస్టేబుల్ బూటుకాలితో తన్నారు. మహిళా కానిస్టేబుల్.. అలీముల్లా దవడపై కొట్టారు. గుర్తింపుకార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా అని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పురుషులకు దిశ యాప్ ఎందుకని నిలదీశారు. అంతలో మరో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలసి అలీముల్లాను స్టేషన్కు తీసుకెళ్లేందుకు బలవంతంగా ఆటో ఎక్కించబోయారు. బాధితుడు ప్రతిఘటించారు. చివరికి పోలీసులు అతని ఐడీకార్డును తీసుకుని వెళ్లిపోయారు. అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలసి జరిగిన ఘటనను బాధితుడు వివరించారు. ఈ ఘటనకు ఎస్పీ విచారణకు ఆదేశించి.. నలుగురు కానిస్టేబుల్స్ను వీఆర్కు పంపించారు.