తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్ టీకాతో మోదీ ఇచ్చిన సందేశమేంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత, అందులోనూ కొవాగ్జిన్ టీకాను స్వీకరించి.. మోదీ బలమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏంటి? కొవాగ్జిన్ టీకా తీసుకోవాలన్న మోదీ నిర్ణయం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?

By

Published : Mar 1, 2021, 11:03 AM IST

Updated : Mar 1, 2021, 1:54 PM IST

PM sends a strong signal by taking locally developed COVAXIN
మోదీ వ్యాక్సిన్

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత కరోనా టీకా తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సోమవారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్​కు వెళ్లి వ్యాక్సిన్ తొలి డోసు స్వీకరించారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. మోదీ టీకా స్వీకరించిన విషయానికి విశేష ప్రాధాన్యం ఉంది. దేశీయ టీకాను వేయించుకొని భారత శాస్త్రవేత్తలకు గౌరవం కల్పించడమే కాకుండా.. కొవాగ్జిన్ టీకాను తీసుకొని విమర్శలకు చెక్ పెట్టారు మోదీ.

దేశంలో అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన కరోనా టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. హైదరాబాద్​కు చెందిన భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేసింది. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్​స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసింది. ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​కు సైతం అత్యవసర అనుమతులు వచ్చాయి. దీన్ని పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.

మోదీ టీకా స్వీకరిస్తున్న వీడియో

కొవాగ్జినే ఎందుకు?

అయితే, కొవిషీల్డ్​కు బదులుగా కొవాగ్జిన్ టీకాను స్వీకరించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బలమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది. దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న నేత ఈ టీకాను స్వీకరించడం ద్వారా భారత శాస్త్రవేత్తల సామర్థ్యాలను గుర్తించినట్లైంది.

కొవిషీల్డ్ భారత్​లో తయారైనా.. విదేశీ సంస్థలు దాని అభివృద్ధిలో భాగమయ్యాయి. కానీ, కొవాగ్జిన్ పూర్తిస్థాయి స్వదేశీ టీకా. అందులోనూ భారత ప్రభుత్వానికి చెందిన సంస్థలు కొవాగ్జిన్ తయారీలో పాల్గొన్నాయి. అందుకే కొవాగ్జిన్​కు మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

టీకా వేసిన నర్సులతో ప్రధాని

వారికి చెక్

రెండో విషయం టీకా భద్రత. కొవాగ్జిన్ టీకాపై కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ ప్రయోగ ఫలితాలు వెలువడక ముందే కొవాగ్జిన్​కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఆదరాబాదరాగా టీకాను అందుబాటులోకి తీసుకొస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. వీటన్నిటికీ మోదీ ఇప్పుడు చెక్​ పెట్టినట్లైంది. కొవాగ్జిన్ తీసుకోవాలన్న మోదీ నిర్ణయంతో.. డీసీజీఐ అనుమతులపై సంశయం వ్యక్తం చేసినవారికి బలమైన సందేశం వెళ్లింది.

ప్రధాని ఈ టీకా స్వీకరించడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా పేర్కొన్నారు.

"తొలి రోజే ప్రధానమంత్రి టీకా తీసుకోవడం వల్ల ఏవైనా అపోహలు ఉంటే తొలగిపోతాయి. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. టీకా తీసుకునేందుకు ముందుకొస్తారు. వైరస్​ నుంచి భారత్ విముక్తి పొందుతుంది."

- డా. రణ్​దీప్​ గులేరియా, దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్

ఆలస్యంగా తీసుకోవడంపై

దేశవ్యాప్తంగా జనవరిలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. ప్రధానమంత్రి వ్యాక్సిన్​ను స్వీకరించకపోవడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఇతర దేశాధినేతల్లా తొలుత ప్రధానే టీకా తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే మోదీ మాత్రం దీనిపై ఎక్కువగా స్పందించలేదు. తొలుత వైద్యులు, ఇతర కరోనా యోధులకే టీకా అందిస్తామని వ్యాక్సిన్ ప్రారంభించిన సమయంలోనే మోదీ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఇందుకు అతీతం కాదని తేల్చి చెప్పారు. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు టీకా పంపిణీ ప్రారంభమయ్యే రోజునే వ్యాక్సిన్ తీసుకున్నారు.

(కృష్ణానంద్ త్రిపాఠీ, ఈటీవీ భారత్ డిప్యూటీ న్యూస్ ఎడిటర్)

ఇదీ చదవండి:రోడ్టు పక్కన రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

Last Updated : Mar 1, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details