Ukraine Russia Crisis: భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ దేశం నుంచి భారతీయ పౌరుల తరలింపుపై దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్, పియూష్ గోయల్ సహ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండురోజుల వ్యవధిలో ప్రధాని మోదీ నిర్వహించిన నాలుగో ఉన్నతస్థాయి సమావేశం కావడం విశేషం.
ఉక్రెయిన్లోని రెండో పెద్ద నగరమైన ఖర్కిన్లో రష్యా జరిపిన షెల్లింగ్లో కర్ణాటక వైద్యవిద్యార్థి మృతి చెందటంతోపాటు అక్కడి పరిస్థితులు మరింత దిగజారిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ భేటీ నిర్వహించినట్లు పేర్కొన్నాయి. ఉక్రెయిన్లోని భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించటం ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
యూరోపియన్ కౌన్సిల్ సంతాపం
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్.. ప్రధాని మోదీతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్ణాటక విద్యార్థి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు మిచెల్.
"అమాయక పౌరులపై రష్యా విచక్షణారహిత దాడుల చేస్తోంది. ఈ కారణంగా నేడు మంగళవారం ఖార్కివ్లో భారతీయ విద్యార్థి మరణించాడు. ఇందుకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను" అని చార్లెస్ మిచెల్ ట్వీట్ చేశారు.