ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.
ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ రాష్ట్రాల్లో 'ఆర్ ఫ్యాక్టర్' ఒకటికి మించి ఉండటం ఆందోళనకరమని చెన్నైలోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్' పరిశోధకుల బృందం తెలిపింది. ఆర్ ఫ్యాక్టర్ 1 దాటిపోతే కరోనా మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.