అన్నదాతలను ప్రధాని మోదీ మోసగించారని.. వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నది చెప్పకుండానే రాజ్యసభలో ఆయన ప్రసంగం సాగించారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడారు.
"తమ సమస్యల పరిష్కారానికి ప్రధాని ఏం చెబుతారా అని రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వాటి గురించి ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నవారికి తీవ్ర నిరాశే మిగిల్చారు. వివాదాస్పద చట్టాలను రద్దుచేసి, విస్తృత సంప్రదింపులతో కొత్తచట్టం తీసుకొస్తామని ప్రధాని చెప్పి ఉండాల్సింది. ముఖ్యమైన ఈ అంశాలేవీ లేకుండానే.. దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఆయన ప్రసంగం సాగింది. మూడు వ్యవసాయ చట్టాల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కానీ ప్రజలు ఆందోళన చేస్తున్నారని మాత్రమే ప్రధాని చెప్పారు. చట్టాల గురించి తెలియకపోవడానికి మేమేమైనా మూర్ఖులమా? కోట్ల మంది రైతుల్లో విద్యావంతులు లేరని ఆయన అనుకుంటున్నారా?" అని ఖర్గే విరుచుకుపడ్డారు.
ఖర్గేకు బెదిరింపు ఫోన్ కాల్