PM Modi: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో భారత రక్షణ సన్నద్ధత, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(సీసీఎస్)తో సమావేశమయ్యారు.
Modi CCS meeting
ఉక్రెయిన్లో ప్రస్తుత పరిణామాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మోదీ. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్ గంగ' కార్యక్రమంపై ఆరా తీశారు. ఖార్కివ్లో మరణించిన నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో భాగంగా.. దేశ భద్రతపై ఉన్నతాధికారులు అధికారులు ప్రధానికి వివరాలు తెలియజేశారు. రక్షణ కోసం సరిహద్దులతో పాటు వాయు, సముద్ర మార్గాల్లో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను వివరించారు.
సాంకేతికత వినియోగంపై...
'ఈ సందర్భంగా రక్షణ రంగంలో సాంకేతికత ఉపయోగంపై ప్రధాని కీలక సూచనలు చేశారు. దేశ రక్షణ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను భాగం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రక్షణ రంగంలో ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో భారత్ పురోగతిని సమీక్షించారు. రక్షణ రంగంలో భారత్ను స్వయం సమృద్ధ దేశంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని మోదీ స్పష్టం చేశారు. దీని వల్ల దేశ రక్షణ సామర్థ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థ సైతం బలపడుతుందని చెప్పారు' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.