తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2023, 6:54 PM IST

ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్.. సోమవారం బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ

రైతుల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల నిధులు వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్ యోజనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.

pm-kisan-fund-release-date-2023
pm-kisan-fund-release-date-2023

రైతులకు గుడ్​న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపించనున్నారు. పీఎం కిసాన్ యోజనలో భాగంగా సోమవారం 8 కోట్ల మంది ఖాతాల్లోకి రూ.16,800 కోట్లు జమా చేయనున్నారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ఇది ఉపయోగపడనుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొని.. మోదీ ఈ నిధులు విడుదల చేస్తారని ఓ అధికారిక ప్రకటన ద్వారా కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్, జల్​జీవన్ మిషన్ లబ్ధిదారులు సహా లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా సైతం కార్యక్రమంలో భాగం కానున్నారని తెలిపింది.

రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు జమా చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో ఈ నిధులను విడుదల చేస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు వెళ్లిపోతుంది. 2018 డిసెంబర్​లో తొలుత ఈ పథకాన్ని ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. 2022 మేలో 11వ విడత, అక్టోబర్​లో 12వ విడత సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు.

ఇప్పటివరకు రూ.2.25లక్షల కోట్లు..
పీఎం-కిసాన్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ విశేష ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం తెలిపింది. సోమవారం విడుదల చేయనున్న 12వ విడత.. రైతుల ఆదాయాన్ని మరింత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. ఇప్పటివరకు రూ.2.25 లక్షల కోట్లను 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు అందించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నట్లు వెల్లడించింది. కరోనా సమయంలోనే రూ.1.75 లక్షల కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది. మహిళా రైతులు మొత్తంగా రూ.53,600 కోట్లు అందుకున్నారని వివరించింది.

పీఎం కిసాన్ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని కేంద్రం పేర్కొంది. రైతులకు నగదు లభ్యత పెరిగిందని తెలిపింది. వ్యవసాయ పెట్టుబడుల విషయంలోనూ ఆశాజనకమైన ఫలితం కనిపిస్తోందని వివరించింది. రైతులు రిస్క్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారని, తద్వారా ఉత్పాదక మరింత పెరుగుతోందని వెల్లడించింది. వ్యవసాయ అవసరాలతో పాటు విద్య, వైద్యం, పిల్లల వివాహం వంటి వాటికీ పీఎం కిసాన్ నిధులు రైతులకు ఉపయోగపడుతున్నాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details