పీఎం కేర్స్ ఫండ్(PM CARES Fund) అనేది భారత ప్రభుత్వ నిధి కాదని, సేకరించిన నగదు ప్రభుత్వ కాన్సాలిడెటెడ్ నిధికి వెళ్లదని దిల్లీ కోర్టుకు తెలిపింది కేంద్రం. పీఎం కేర్స్ నిధిని(PM CARES Fund) రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రస్టు పారదర్శకంగా పని చేస్తున్నట్లు తెలిపారు పీఎం కేర్స్ ట్రస్ట్లో(pm cares trust) విధులు నిర్వర్తిస్తున్న పీఎంఓ సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవా. భారత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఏర్పాటు చేసిన ప్యానల్ ద్వారా పీఎం కేర్స్ ఫండ్స్ను ఆడిట్ చేసినట్లు చెప్పారు.
"పీఎం కేర్స్లో పారదర్శకతను తెలిపేందుకు ఆడిట్ చేసిన నివేదికను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. నివేదికతో పాటు ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఏ విధంగా ఖర్చు చేశామనే వివరాలను పొందుపరిచాం. పిటిషనర్ ఒక ప్రజాచైతన్య వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పుడు.. కేవలం పారదర్శకత కోసమే కాదు, ఇతర ఉపశమనాల కోసమూ కోరాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం పీఎం కేర్స్ ప్రభుత్వ నిధిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ట్రస్టులో గౌరవ ప్రాతిపదికన పని చేస్తున్నా. ఇది ఛారిటబుల్ ట్రస్ట్. రాజ్యాంగం, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏర్పాటు చేసింది కాదు.
పారదర్శక నియమాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రస్టు పని చేస్తోంది. కాబట్టి, పారదర్శతను తీసుకొచ్చేందుకు అన్ని తీర్మానాలను వెబ్సైట్లో పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ట్రస్టు ఫండ్ భారత ప్రభుత్వం నిధి కాదు. ఆ నిధులు ప్రభుత్వ మూలధనంలోకి వెళ్లవు. "