తెలంగాణ

telangana

నాలుగేళ్లుగా పరిచయం- పక్కా ప్లాన్​తో రెక్కీ చేసి మరీ దాడి- లోక్​సభ ఘటనలో షాకింగ్ నిజాలు

By PTI

Published : Dec 13, 2023, 7:37 PM IST

Updated : Dec 13, 2023, 7:54 PM IST

Parliament Security Breach Today : సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్‌సభలోకి దుండుగులు దూసుకురావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. లోక్​సభ ఛాంబర్​లో దూసుకొచ్చిన ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టైన ఐదుగురు నిందితుల వద్ద ఫోన్లు లభ్యం కాలేదని పేర్కొన్నాయి.

parliament security breach today
parliament security breach today

Parliament Security Breach Today :లోక్​సభ ఛాంబర్​లో ఆగంతకులు సృష్టించిన కలకలంపై విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నాయి. అరెస్టైన నిందితుల వద్ద సెల్​ఫోన్లు లభ్యం కాలేదని వెల్లడించాయి. ఆరుగురు నిందితులు ఒకరికొకరు ఇంతకుముందు 4 ఏళ్ల నుంచే పరిచయం ఉన్నారని, వీరందరూ హరియాణాలోని గుర్​గ్రామ్​లో ఓ ఇంట్లో ఉన్నారని పేర్కొన్నాయి. వీరంతా కొద్దిరోజుల క్రితమే కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారని వెల్లడించాయి. ఆరుగురూ సభ లోపలకు వెళ్దామని అనుకున్నా.. ఇద్దరికే విజిటర్ పాసులు వచ్చాయని పోలీసు వర్గాలు చెప్పాయి. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. నిందితుల మొబైల్స్ ఎక్కడున్నాయో తెలుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి.

'అకస్మాత్తుగా ఛాంబర్​లోకి దూకారు'
మరోవైపు, లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీలో ఇద్దరు వ్యక్తులు కాసేపు నిశబ్దంగా కూర్చున్నారని ఆ తర్వాత ఛాంబర్​లోకి ఒక్కసారిగా దూకారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొంతమంది లోక్‌సభ ఎంపీలు నిందితులను వెంబడిస్తున్న సమయంలో వారిలో ఒకరు పొగ డబ్బాను సభలోకి విసిరారని సందర్శకుల గ్యాలరీ వద్ద కూర్చున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నప్పుడు నిందితులు ఎటువంటి నినాదాలు చేయలేదని వెల్లడించారు. నిందితులు లోక్​సభ ఛాంబర్​లోకి దూకినప్పుడు సందర్శకుల గ్యాలరీలో దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారని అన్నారు. ఐదు అంచెల భద్రత ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో ఇలాంటి ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

'నా కుమారుడు నిజాయితీపరుడు'
తన కుమారుడు నిజాయితీపరుడని, సమాజానికి సేవ చేయాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తాడని నిందితుడు మనోరంజన్ తండ్రి దేవరాజె గౌడ తెలిపారు. తన కొడుకు తప్పు చేస్తే ఊరి తీసేయమని అన్నారు. 'పార్లమెంట్​పై దాడిని ఖండిస్తున్నా. నా కొడుకు చాలా మంచివాడు, నిజాయితీపరుడు. ఎల్లప్పుడూ సమాజం కోసం ఆలోచిస్తాడు. స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత అతడిలో ఆలోచనల్లో మార్పు వచ్చిందనకుంటున్నా. 2016లో బీఈ (బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్) పూర్తి చేశాడు. ప్రస్తుతం పొలం పనులు చూసుకుంటున్నాడు. ఇంతకుముందు దిల్లీ, బెంగళూరులోని కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశాడు.' అని దేవరాజెగౌడ మీడియాతో చెప్పారు.

'నిరసన తెలపడానికి దిల్లీకి'
లోక్​సభలో ఛాంబర్​లో దూకిన ఘటనలో అరెస్టైన సాగర్​ శర్మ దిల్లీలో నిరసన తెలపడానికి కొద్ది రోజుల క్రితం లఖ్​నవూలోని తన ఇంటి నుంచి వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో అతడి ప్రమేయం గురించి తమకు తెలియదని అన్నారు. సాగర్ శర్మ ఈ-రిక్షా నడిపేవాడని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఉద్యోగం చేసేవాడని అతడి సోదరి తెలిపింది.

'రైతుల నిరసనల్లో పాల్గొంది'
పార్లమెంట్ వెలుపల అరెస్టైన నీలమ్​(42) అనే మహిళ సోదరుడు స్పందించారు. 'నా సోదరి దిల్లీ వెళ్లిందని కూడా మాకు తెలియదు. ఆమె చదువు కోవడం హిసార్‌లో ఉందని మాకు తెలిసింది. నా సోదరి ఇటీవల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిపోయింది. నీలమ్​ BA, MA, B.Ed, M.Ed చదివింది. అలాగే NETలో అర్హత సాధించింది. ఆమె నిరుద్యోగ సమస్యను అనేక సార్లు లేవనెత్తింది. అలాగే రైతుల నిరసనల్లో పాల్గొంది.' అని నీలమ్ సోదరుడు తెలిపారు.

బీజేపీ ఎంపీ పేరుతో పాస్
లోక్​సభ ఛాంబర్​లోకి దూకిన నిందితుడు మనోరంజన్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయానికి తరచుగా వెళ్లేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత మూడు నెలలుగా ప్రతాప్ సింహాను పార్లమెంట్ విజిటర్స్​ పాస్ ఇప్పించమని మనోరంజన్​ కోరుతున్నాడని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు మనోరంజన్​, మరో నిందితుడు సాగర్ శర్మకు ఎంపీ కార్యాలయం నుంచి పాస్​లు జారీ అయినట్లు వెల్లడించాయి. మొత్తం ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి మూడు పాస్​లు జారీ అయ్యాయని, మూడో పాస్ తీసుకున్న మరో మహిళకు పార్లమెంట్ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాయి.

ప్రతాప్ సింహాపై చర్యలకు విపక్షాలు డిమాండ్​
పార్లమెంట్​లో భద్రతా ఉల్లంఘనపై అధికార బీజేపీపై విపక్షాలు మండిపడ్డాయి. లోక్​సభ ఛాంబర్​లో​ దూకిన నిందితులకు విజిటర్స్​ పాస్‌లను జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. టీఎంసీ నాయకురాలు మహువాపై చర్యలు తీసుకున్నట్లే ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను టీఎంసీ కోరింది. ప్రధాని మోదీ నాయకత్వంలో పార్లమెంట్​లో ఎంపీలు కూడా సురక్షితంగా లేరని ఈ ఘటన తెలియజేస్తోందని విమర్శించింది. నిందితులకు విజిటర్ పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను అదుపులోకి తీసుకుని విచారించాలని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. 'ఇది తీవ్రమైన భద్రతా లోపం. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎంపీలకు కూడా భద్రత లేదని ఈ రోజు జరిగిన సంఘటన తెలియజేస్తోంది' అని ఈటీవీ భారత్​తో అన్నారు.

పార్లమెంట్ భద్రతా ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలెక్ ఈటీవీ భారత్​తో అన్నారు. 'నిందితులకు విజిటర్స్ పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీపై విచారణకు ఆదేశించాలి. అలాగే కొత్త పార్లమెంట్‌లోని సందర్శకుల గ్యాలరీ నుంచి నిందితులు సులభంగా దూకారు. కాబట్టి పార్లమెంట్ గ్యాలరీ నిర్మాణం సరిగ్గా జరగలేదని భావిస్తున్నా.' అని వ్యాఖ్యానించారు.

Last Updated : Dec 13, 2023, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details