తెలంగాణ

telangana

'ఒంటికి నిప్పంటించుకోవాలని నిందితుల ప్లాన్​'- పార్లమెంట్​ ఘటనలో విస్తుపోయే నిజాలు

By PTI

Published : Dec 16, 2023, 3:30 PM IST

Updated : Dec 16, 2023, 8:39 PM IST

Parliament Security Breach Probe : పార్లమెంట్​పై దాడి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు, పార్లమెంట్​లో భద్రతా ఉల్లంఘనకు ప్రధాని మోదీ విధానాలే కారణమని రాహుల్​ గాంధీ ఆరోపించారు.

Parliament Security Breach Probe
Parliament Security Breach Probe

Parliament Security Breach Probe : పార్లమెంట్​లో భద్రతా ఉల్లంఘన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం, కరపత్రాలను విసిరేయడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. అయితే చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఈ వివరాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

'లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలనూ అన్వేషించారు. తమ ఒంటికి ఫైర్‌ప్రూఫ్‌ జెల్‌ పూసుకుని తమకు తాము నిప్పంటించుకునే ప్లాన్‌ వేశారు. పార్లమెంట్​ లోపల కరపత్రాలను విసరాలని కూడా భావించారు. కానీ, చివరకు బుధవారం నాటి ప్రణాళిక (లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం) అమలు చేశారు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిందితులను గతంలో వారు కలిసిన, ఈ కుట్రకు ప్లాన్‌ చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝాను త్వరలో రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్​లో ఘటనల అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయిన లలిత్ ఝా గురువారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా తన ఫోన్‌ను పారేసిన, ఇతరుల ఫోన్లను కాల్చేసిన ప్రాంతాలకు లలిత్ ఝాను తీసుకెళ్లనున్నారు. శనివారం లేదా ఆదివారం పార్లమెంట్‌లోనూ 'సీన్‌ రీక్రియేషన్‌' చేయనున్నట్లు సమాచారం.

మరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడు మహేశ్ కుమావత్​ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని దిల్లీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితుడు మహేశ్ కుమావత్​కు దిల్లీ కోర్టు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మహేశ్ కుమావత్​ను 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు ప్రభుత్వ న్యాయవాది. ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో మహేశ్‌ ప్రమేయం ఉందని వాదించారు. దేశంలో అరాచకం వ్యాప్తి చేయడానికి రూపొందించిన కుట్రలో భాగమయ్యాడని, దీంతో అతడిని విచారించాల్సి ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిందితుడు మహేశ్ కుమావత్​కు ఏడు రోజుల కస్టడీకే అనుమతించింది.

ఎంపీలకు స్పీకర్ లేఖ
పార్లమెంట్​లో భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించేందుకు, ఈనెల13న జరిగినటువంటి ఘటనలు జరగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. ఈ మేరకు పార్లమెంటు సభ్యులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ నివేదికను త్వరలోనే సభ్యులతో పంచుకోనున్నట్లు స్పీకర్‌ పేర్కొన్నారు.

'పార్లమెంట్​పై దాడికి మోదీ విధానాలే కారణం'
పార్లమెంట్​లో అలజడి ఘటనకు ధరల పెరుగుదల, నిరుద్యోగమే ప్రధాన కారణమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని రాహుల్‌ ఆరోపించారు. ఈ ఘటన ఎందుకు జరిగిందన్నది కూడా ఆలోచించాలని తెలిపారు. ప్రధాని మోదీ విధానాల వల్లే దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు.

"పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన జరిగింది. కానీ ఆ ఘటన ఎందుకు జరిగింది. దేశంలో అతిపెద్ద సమస్య ఉంది. అదే నిరుద్యోగ సమస్య. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశంలోని యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. లోక్‌సభలో భద్రత ఉల్లంఘనకు దేశంలోని నిరుద్యోగం, ధరల పెరుగుదలే ప్రధాన కారణం."
--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

నా కొడుకు అమాయకుడు, న్యాయ పోరాటానికి మేము సిద్ధం! : పార్లమెంట్ దాడి 'మాస్టర్​మైండ్' తండ్రి

షూ సోల్ కట్ చేసి గ్యాస్ బాంబులు ఫిక్స్- పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు

Last Updated : Dec 16, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details