తెలంగాణ

telangana

పార్లమెంట్​ ఘటనపై 'సీన్‌ రీక్రియేషన్‌'! లొంగిపోవడానికి ముందే కీలక ఆధారాలు ధ్వంసం

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 11:48 AM IST

Parliament Security Breach Case : దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనను రీ-క్రియేట్​ చేయనున్నట్లు తెలుస్తోంది. శని లేదా ఆదివారాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. మరోవైపు, కీలక నిందితుడు లలిత్‌ ఝా విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోక ముందే కీలక అధారాలను లలిత్‌ ధ్వంసం చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

parliament security breach case
parliament security breach case

Parliament Security Breach Case : పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే నిందితులపై తీవ్రవాద చర్యల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 13 నాటి అలజడి ఘటనను సీన్​ రీక్రియేట్‌ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నిందితులను పార్లమెంట్‌కు తీసుకెళ్లి శని లేదా ఆది వారాల్లో సీన్‌ రీక్రియేషన్‌ చేయనున్నట్లు సమాచారం.

తనిఖీలను తప్పించుకుని నిందితులు రంగు పొగ గొట్టాలతో పార్లమెంట్‌ లోపలికి ఎలా వెళ్లగలిగారు? లోక్‌సభలో తమ ప్రణాళికను ఎలా అమలు చేశారు? వంటివి తెలుసుకునేందుకు ఈ రీక్రియేషన్‌ ఉపయోగపడుతుందని స్పెషల్‌ సెల్‌ విభాగ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఘటన జరిగిన రోజే ఈ సీన్‌ రీక్రియేషన్‌ ప్రక్రియ చేపట్టాలని పోలీసులు భావించిగా, సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యపడలేదు. శని, ఆది వారాల్లో పార్లమెంట్‌ సమావేశాలు లేకపోవడం వల్ల ఆ రోజుల్లో దీనిని చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లొంగిపోయిన ప్రధాన సూత్రధారి
లోక్‌సభ ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విచారణ కోసం లలిత్‌ను స్పెషల్ సెల్ కు అప్పగించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే లొంగిపోవడానికి ముందే లలిత్‌ కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్‌ ఘటన తర్వాత రాజస్థాన్‌లోని కూచమన్‌కు పారిపోయిన లలిత్‌ అక్కడ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి నలుగురు నిందితుల ఫోన్లను తగులబెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్‌లో అలజడి రేపడానికి ముందు లలిత్‌ ఝా నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లను తన వద్ద ఉంచుకున్నాడు. పార్లమెంట్ సమీపంలో నీలమ్‌, అమోల్‌ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్‌ ఫోన్లో రికార్డ్‌ చేశాడు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే నిందితులదరి ఫోన్లతో లలిత్‌ అక్కడి నుంచి రాజస్థాన్‌ పరారయ్యాడు. అనంతరం ఆ వీడియోను బంగాల్‌కు చెందిన ఓ ఎన్​జీఓ సభ్యురాలికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో లలిత్‌ తమ ఎన్​జీఓతో కలిసి పనిచేశాడని పార్లమెంట్‌ వద్ద ఆందోళనకు సంబంధించి తనకు వాట్సప్‌లో ఓ వీడియో షేర్‌ చేసి దాన్ని వైరల్‌ చేయమని మెసేజ్‌ చేశాడని ఎన్​జీఓ సభ్యురాలు తెలిపారు.

ఫోన్‌లతో లలిత్ అక్కడి నుంచి రాజస్థాన్‌ పారిపోయాడు. పారిపోయే క్రమంలోనే ఇన్‌ స్టాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. రాజస్థాన్‌లోని కూచామన్‌లో లలిత్ ఝాకు అతడి స్నేహితుడు మహేష్‌ ఆశ్రయం ఇచ్చాడు. వారిద్దరూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ అని విచారణలో పోలీసులు గుర్తించారు. లోక్‌సభలో కలకలం రేపిన సమయంలో లలిత్‌ పార్లమెంటు పరిసరాల్లోనే ఉన్నట్లు కూడా గుర్తించారు. పార్లమెంట్‌లోకి నిందితులు కరపత్రాలను కూడా తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. 'ప్రధాని మోదీ కనిపించడం లేదుం' అంటూ ముద్రించిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లలిత్ ఝా తనంతట తానుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని, ప్రత్యేక దర్యాప్తు అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. లలిత్‌కు రాజస్థాన్‌లో ఆశ్రయం ఇచ్చిన మహేష్‌ కూడా లొంగిపోయాడని వెల్లడించారు.

నిందితులకు ఏడు రోజుల రిమాండ్​
మరోవైపు పార్లమెంట్‌లో అలజడి రేపిన నలుగురు నిందితులకు దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవిలను ముంబయి, మైసూర్, లఖ్‌నవూ తీసుకెళ్లి విచారించేందుకు అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ హర్దీప్ కౌర్ అనుమతించారు. నిందితులు లఖ్‌నవూలో ప్రత్యేక బూట్లు, ముంబయిలో గ్యాస్‌ క్యాన్లను కొనుగోలు చేశారు. వీరిని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు. అంతేగాక, నిందితులను గురుగ్రామ్‌లోని వారి ఫ్లాట్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడే వారు ఈ ఘటనకు ప్లాన్‌ చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. మరోవైపు నిందితులు గత 15 రోజుల్లో ఎవరెవరికి ఫోన్‌ చేశారన్న జాబితాను కూడా పోలీసులు రూపొందించారు. వారందరికీ ఫోన్లు చేసి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కుట్ర పన్నింది ఆరుగురేనా? లేకా వీరి వెనుక ఇంకెవరైనా పెద్ద వ్యక్తులున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

పార్లమెంట్​లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది?- అంత ఈజీగా లోపలికి వెళ్లొచ్చా!

'లోక్​సభ ఘటన' మరో నిందితుడు లలిత్ అరెస్ట్- కోల్​కతాతో కనెక్షన్​!- అతడే స్కెచ్ వేశాడా?

ABOUT THE AUTHOR

...view details