తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2023, 6:12 PM IST

ETV Bharat / bharat

మణిపుర్‌ హింసపై చర్చకు పట్టు.. పార్లమెంట్​లో విపక్షాల ఆందోళన.. రెండో రోజు వాయిదాపడ్డ ఉభయసభలు

Parliament Adjourned Today : మణిపుర్‌ అంశం రెండోరోజు కూడా పార్లమెంటును కుదిపేసింది. వరుసగా రెండో రోజు ఎలాంటి చర్చ లేకుండానే ఉభయసభలు వాయిదాపడ్డాయి. మణిపుర్‌ అంశంపై రూల్‌ 176 ప్రకారం చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించగా.. రూల్‌ 267 ప్రకారం చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు ఆందోళనకు దిగటం వల్ల ఉభయసభలు సోమవారానికి వాయిదాపడ్డాయి.

opposition-concern-in-parliament-of-india-on-manipur-incident-parliament-adjourned
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2023

Parliament Adjourned Today : పార్లమెంటు వర్షాకాల సమావేశాల రెండోరోజు కూడా వాయిదాలపర్వం కొనసాగింది. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి వెల్‌లోకు దూసుకెళ్లి.. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. మణిపుర్‌ రక్తమోడుతోందంటూ కాంగ్రెస్‌, డీఎంకే, లెఫ్ట్‌ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని, సంప్రదింపులు, చర్చలతోనే సాధ్యమని స్పీకర్‌ ఓంబిర్లా ప్రతిపక్ష సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు శాంతించకపోవటంతో స్పీకర్‌ ఓం బిర్లా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడాలని కోరారు.

ఉప సభా నాయకుడైన రాజ్‌నాథ్‌ సింగ్‌ మణిపుర్‌ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మణిపుర్‌ పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవాలన్న ఆయన ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘటనలపై దేశమంతా సిగ్గుతో తలదించుకుందని ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించటం వల్ల ఈ అంశాన్ని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థమవుతోందన్నారు. మణిపుర్‌ ఘటనలపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని, ఆ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పటమే కాకుండా ఇప్పుడు సభలోనూ చెబుతున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు.

Parliament Monsoon Session 2023 : అయితే ప్రతిపక్షాలు మాత్రం మణిపుర్‌ అంశంపై చర్చ జరగకూడదన్న ఉద్దేశంతో అనవసరంగా సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అయినా ప్రతిపక్షాలు పట్టువీడకపోవటంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు.. మణిపుర్‌ ఘటనలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్షాలు శాంతించలేదు. దీంతో స్పీకర్‌ సభను.. సోమవారానికి వాయిదా వేశారు.

అటు మణిపుర్‌సహా వివిధ అంశాలపైవిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదాపడింది. మణిపుర్ అంశంపై ఆరంభంలోనే రాజ్యసభ వాయిదా పడింది. మధ్యాహ్నం భోజనం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్షాల ఆందోళనల సందర్భంగా గందరగోళ దృశ్యాలు కనిపించటం వల్ల రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రోసిడింగ్స్‌ నుంచి కొన్ని పదాలను తొలగించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details