ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత.. ధరల పెరుగుదలపై చర్చ షురూ - undefined
14:36 August 01
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత.. ధరల పెరుగుదలపై చర్చ షురూ
లోక్సభలో ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదలపై లోక్సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు సూచించారు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
సభలో ఆందోళన చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించినందుకు నలుగురు కాంగ్రెస్ సభ్యులు సోమవారం సస్పెండ్ అయ్యారు. మానిక్కం టాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిలపై సస్పెన్షన్ విధించారు. సమావేశాలు ముగిసేవరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని సభాపతి ప్రకటించారు. అయితే, తాజాగా వీరి ప్రవర్తనపై కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. సభాపతిని అవమానించాలన్నది సభ్యుల ఉద్దేశం కాదని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ.. దేశంలో 14 నెలల నుంచి ద్రవ్యోల్బణం రెండంకెల పైన ఉందని అన్నారు. ఇది ముప్పై ఏళ్ల గరిష్ఠమని చెప్పారు. వినియోగదారుల ధరల సూచీ.. ఆకాశాన్నంటుతోందని పేర్కొన్నారు. రోజువారీ వినియోగ వస్తువులైన బియ్యం, పెరుగు, పన్నీర్పై జీఎస్టీ విధించడాన్ని తప్పుబట్టారు. పెన్సిల్, షార్ప్నర్లపైనా ప్రభుత్వం పన్ను విధిస్తోందని.. పిల్లలను సైతం విడిచిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.
TAGGED:
parliament live updates