తెలంగాణ

telangana

అన్నాడీఎంకేలో మళ్లీ వివాదాలు- చీలిక ఖాయమా?

By

Published : May 11, 2021, 2:35 PM IST

Updated : May 11, 2021, 3:09 PM IST

అన్నాడీఎంకే అగ్రనేతలైన పళనిస్వామి, పన్నీర్​సెల్వం మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. అసెంబ్లీలో విపక్ష పార్టీ డిప్యూటీ లీడర్ పదవిని పన్నీర్​సెల్వం తిరస్కరించడం వల్ల అభిప్రాయభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇది చిలికి చిలికి గాలివానలా తయారయ్యే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. పార్టీ చీలికకూ కారణం కావొచ్చని చెబుతున్నారు.

OPS rejects dy leader post in assembly, rift in AIADMK widens
అన్నాడీఎంకేలో మళ్లీ వివాదాలు- చీలిక ఖాయమా?

తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ పొరపొచ్చాలు మొదలయ్యాయి. పార్టీ అగ్రనేతలైన పన్నీర్​సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు తలెత్తాయి. తమిళనాడు అసెంబ్లీలో డిప్యూటీ లీడర్​ పదవిని పన్నీర్​సెల్వం తిరస్కరించారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సోమవారం సమావేశం జరగగా... మాజీ స్పీకర్ పీ ధనపాల్​ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని పన్నీర్​సెల్వం ప్రతిపాదించారు. అయితే ఈ ప్రయత్నం విఫలమైందని పార్టీకి చెంది ఓ ఎమ్మెల్యే చెప్పారు. 66 మంది ఎమ్మెల్యేలలో 61 మంది పళనిస్వామికి మద్దతిచ్చారని... దీంతో పన్నీర్​సెల్వం వెంటనే పార్టీ కార్యాలయం​ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. పార్టీలో తన స్థానంపై వాస్తవాన్ని గ్రహించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారని ఆ ఎమ్మెల్యే వెల్లడించారు.

పార్టీలో తన స్థానం విషయంలో వెనక్కి తగ్గరాదని పన్నీర్​సెల్వం అనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డిప్యూటీ లీడర్ స్థానాన్ని తిరస్కరించడమే ఇందుకు సూచన అని చెబుతున్నారు. పార్టీలో తిరుగుబాటు మొదలయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. చీలిక వచ్చినా ఆశ్చర్యం లేదని జోస్యం చెబుతున్నారు.

అప్పటి నుంచే ఇలా..

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన ఈ రగడ ఇప్పటికీ సద్దుమణగలేదు. భాజపా అధినాయకత్వం జోక్యం చేసుకొని పన్నీర్​సెల్వం, పళనిస్వామితో చర్చలు జరిపినప్పటికీ.. అది తాత్కాలికమేనని అర్థమవుతోంది. పైకి బాగానే ఉన్నా.. పార్టీలో మాత్రం అభిప్రాయభేదాలకు కొదవ లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవేవీ పెద్దగా బయటకు రాలేదు. తాజా ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, తేవర్ వర్గంలో పట్టు కోల్పోవడం వంటి పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేకు బలమైన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం ఓట్లు.. అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే మధ్య చీలిపోయాయి. ఈ ప్రభావంతో అనేక స్థానాలను డీఎంకేకు కోల్పోవాల్సి వచ్చింది.

పన్నీర్​సెల్వంతో శశికళ జట్టు?

తాజా జరుగుతున్న పరిణామాలు తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శశికళ, దినకరన్ కలిసి పన్నీర్​సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశమూ లేకపోదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:మళ్లీ రాజకీయాల్లోకి చిన్నమ్మ- అన్నాడీఎంకేపైనే గురి!

"ఏఎంఎంకే పార్టీ వల్ల దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పట్టు కోల్పోతోంది. ఈ పార్టీ వల్ల అన్నాడీఎంకే ఓట్లు చీలిపోయి.. డీఎంకే విజయానికి బాటలు పరిచినట్లైంది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవిని పన్నీర్​సెల్వం తిరస్కరించారంటే.. భవిష్యత్తులో అన్నాడీఎంకేకు మంచి రోజులు లేవని అర్థమవుతోంది. సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే.. పళనిస్వామిని పక్కనబెట్టడం వల్ల తేవర్ వర్గం పార్టీకి దూరమవుతుంది. ఈ విషయంలో శశికళ, దినకరన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది."

-పీ శివకుమార్, జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు

ఒకవేళ అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి ఉంటే ఈ చిన్న చిన్న గొడవలను నేతలు పట్టించుకునేవారు కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రతిపక్షంలో పడిపోవడం వల్ల.. ఈ సమస్యలు తలెత్తాయని, పళనిస్వామికి కఠిన పరిస్థితులు ఎదురుకానున్నాయని పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి:సోషల్ మీడియా వేదికగా కరోనాపై కాంగ్రెస్ పోరు!

Last Updated : May 11, 2021, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details