కొన్నిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఎట్టకేలకు కోలుకున్నారు. అయితే.. వైరస్ బారిన పడ్డప్పుడు తాను అనుభవించిన బాధలు మరెవరికీ కలగకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే.. 'పాకెట్ వెంటిలేటర్' అనే వినూత్న పరికరాన్ని రూపొందించారు. ఆయనే బంగాల్ కోల్కతాకు చెందిన డాక్టర్ రామేంద్ర లాల్ ముఖర్జీ.
ఈ పరికరం సాయంతో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే రోగులకు మేలు కలుగుతుందని రామేంద్ర లాల్ చెప్పారు. పూర్తి స్థాయి వైద్యచికిత్స అందేలోపు రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ధర కూడా చాలా తక్కువేనని అన్నారాయన.
"నాకు కొవిడ్ సోకిన సమయంలో నా ఆక్సిజన్ స్థాయులు 88కి పడిపోయాయి. దాంతోపాటుగా తీవ్రమైన శ్వాససమస్యలు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తు నేను కరోనా నుంచి కోలుకున్నాను. కానీ, నాలా బాధపడుతున్న వారికి ఏదైనా సాయం చేయాలనే ఆలోచన నన్ను కుదిపేసింది. అందుకే ఈ పరికరాన్ని కనిపెట్టాను. పాకెట్ వెంటిలేటర్ తయారు చేసేందుకు నాకు 20 రోజుల సమయం పట్టింది."
-డాక్టర్ రామేంద్ర లాల్ ముఖర్జీ, పాకెట్ వెంటిలేటర్ రూపకర్త