ఝార్ఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం తగ్గినప్పటికీ ఛత్తీస్గఢ్లో నరమేధం కొనసాగతోంది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని తరచూ భీకర దాడులు చేస్తూనే ఉన్నారు. ముఖాముఖీ పోరు కాకుండా మందుపాతరలు, ఐఈడీలు అమర్చి ఎక్కువగా జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. మందుపాతరలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద ఉన్నప్పటికీ IEDలను గుర్తించడం సాధ్యం కావడం లేదు. IEDలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద పూర్తిస్థాయిలో లేకపోవడమే తరచూ ప్రాణాలు కోల్పోవడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి దక్షిణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ సమస్య పెద్ద సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.
మార్చి-జూన్ మధ్య కాలంలో మావోయిస్టులు తమ దళాలను పెంచుకోవడం సహా పోలీసులపై వ్యూహాత్మక దాడులకు ఎక్కువగా వ్యూహరచన చేస్తూ ఉంటారు. అడవుల్లో చెట్లు ఎండిపోవడం, పచ్చదనం తక్కువగా ఉండడం వల్ల బలగాల కదలికలను తేలిగ్గా గుర్తించడం సహా మాటువేసి దాడులు చేయడం వారికి సులభంగా ఉంటుంది. ప్రత్యేకించి ఛత్తీస్గఢ్-తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లో భౌగోళికంగా ట్రై-జంక్షన్గా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో సుక్మా, దంతెవాడ జిల్లాల్లోనే భారీ దాడులు జరిగాయి. 2010లో ఏకంగా 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దంతెవాడ జిల్లా అరన్పూర్లో మావోయిస్టులు 50 కిలోల బరువైన భారీ IEDతో దాడికి పాల్పడి 10 మంది డీఆర్జీ పోలీసుల ప్రాణాలు తీశారు.