దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. ఇందుకు ఆయా టీకాల సామర్థ్యాలను పరిశీలించి దేశంలో వినియోగించుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేటు మార్గాల ద్వారా టీకా పంపిణీ చేయవచ్చని పేర్కొంది. అయితే, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ తాజాగా వెల్లడించింది.
సంప్రదింపులు జరుపుతాం...
ఎలాంటి లాభాపేక్ష లేకుండానే తమ టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో పేద, మధ్య, ధనిక ఆదాయ దేశాలకు అనుగుణంగా తాము వివిధ ధరలను నిర్ణయిస్తున్నామని ఫైజర్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే టీకా ధర ఎంతనే విషయాన్ని మాత్రం ఫైజర్ వెల్లడించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్ టీకా ఒక డోసు ధర 19.5డాలర్లుగా ఉంది.