వివాహాది శుభకార్యాలతో పాటు పండుగల సమయంలో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి వాటికి ఏ ఒక్కరు కూడా రాయల్టీ వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యాల్లో పాటల కాపీరైట్స్కు సంబంధించి స్పష్టతను ఇస్తూ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కీలక ప్రకటన చేసింది.
'వివాహాది శుభకార్యాలతో పాటు ఉత్సవాల సమయంలో సినిమా పాటల వాడకం, ప్రదర్శనకు ఆయా భాగస్వామ్య పక్షాలు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, ఇది కాపీరైట్చట్టం 1957లోని సెక్షన్ 52(1)కు పూర్తిగా విరుద్ధం. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే సాహిత్య, నాటక లేదా మ్యూజిక్/ ఏదైనా సౌండ్ రికార్డింగ్లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) లో ఉంది. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర సంప్రదాయ కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కాపీరైట్ సంస్థలు వ్యవహరించాలి' అని సూచిస్తూ డీపీఐఐటీ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.
'వారి డిమాండ్లు అంగీకరిచొద్దు'.. పౌరులకు కేంద్రం సూచన
మరోవైపు వీటికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు/ యాజమాన్యాలు/ కాపీరైట్ సంస్థలు చేసే డిమాండ్లను అంగీకరించవద్దని సాధారణ పౌరులకూ సూచించింది డీపీఐఐటీ. ప్రభుత్వం చేసిన ప్రకటనను సామాన్యులతో పాటు ఆతిథ్య రంగం కూడా స్వాగతించింది. వివిధ కాపీరైట్ ఉల్లంఘనలను ఎదుర్కొంటున్న పర్యటక రంగానికి సంబంధించిన వారికి ఈ ప్రకటన ఎంతో లాభదాయకంగా మారనుంది.