తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆందోళన వద్దు.. మన టీకాలు పూర్తి సేఫ్'

భారత్​లో వినియోగిస్తున్న కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఈ రెండు కొవిడ్​ టీకాలు అత్యంత సురక్షితమైనవని పేర్కొన్నారు. మరోవైపు.. టీకా పరిధిలోకి మరింత ఎక్కువ మందిని తెచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

By

Published : Mar 27, 2021, 6:46 AM IST

Updated : Mar 27, 2021, 7:11 AM IST

union health minster harsha vardhan
'ఆ రెండు టీకాలు పూర్తి సురక్షితం'

భారత్​లో కరోనా నివారణకు ఉపయోగిస్తున్న కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలు సురక్షితమైనవేనని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్​ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో కొవిషీల్డ్​ టీకా వినియోగం వల్ల రక్తం గడ్డకడుతున్న సమస్యలు ఎదురవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు. టీకా తీసుకున్న తర్వాత ఎదురయ్యే ప్రతికూలతలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నామని హర్షవర్ధన్​ తెలిపారు. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురుకాలేదని చెప్పారు.

"కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాల సమర్థత, భధ్రతకు సంబంధించి క్లినికల్​ డేటాను.. దేశంలోని వ్యాధి నియంత్రణ సంస్థలు పరీక్షించాయి. నేను మళ్లీ చెబుతున్నాను. మనదేశంలో వినియోగిస్తున్న టీకాలు అత్యంత సురక్షితమైనవి. భారత్​లోని టీకాల భద్రత గురించి ఇప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."

- హర్షవర్ధన్,​ కేంద్ర వైద్య శాఖ మంత్రి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంటూ.. వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని హర్షవర్ధన్​ పేర్కొన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయడం సహా.. కరోనా నిబంధనల అమలుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

టీకా పరిధిలోకి మరింత మంది...

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టీకా పరిధిలోకి మరింత ఎక్కువ మంది తెచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు హర్షవర్దన్ తెలిపారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ప్రకటించిన కొన్నిరోజులకే.. మంత్రి చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలో టైమ్స్‌ గ్రూప్‌ నిర్వహించిన సదస్సులో శుక్రవారం పాల్గొన్న హర్షవర్దన్.. స్వదేశీ కరోనా టీకాను ప్రజలు విశ్వసించటం వల్లే చివరి కోటీ డోసులను కేవలం 4 రోజుల వ్యవధిలోనే పంపిణీ చేసినట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా తొలిదశ టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16న మొదలైంది. మొదట వైద్య సిబ్బందికి తర్వాత ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు టీకాలు వేశారు. మార్చి 1న ప్రారంభమైన రెండోవిడత టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. 60ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి 45 ఏళ్ల పైబడినవారందరికీ టీకాలు వేయనున్నారు.

ఇదీ చూడండి:కరోనా సెకండ్ వేవ్​- కారణాలు ఏంటంటే?

Last Updated : Mar 27, 2021, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details