తెలంగాణ

telangana

ETV Bharat / bharat

30+ ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్​ నితీశ్​!

Nitish Kumar politics : తన మార్క్ 'పొత్తులాట'తో బిహార్​ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. భాజపాకు గుడ్​బై చెప్పి.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో జట్టు కట్టారు. మహాకూటమి పార్టీల మద్దతుతో మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఇప్పటికే ఏడుసార్లు సీఎం పగ్గాలు చేపట్టినా.. నితీశ్​ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదని తెలుసా?

By

Published : Aug 9, 2022, 5:11 PM IST

Updated : Aug 9, 2022, 7:54 PM IST

nitish kumar politics
37ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా... దటీజ్​ నితీశ్​!

Nitish Kumar CM how many times : బిహార్​ రాజకీయాల్లో జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ది ప్రత్యేక స్థానం. వికాస్‌ పురుష్‌గా, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరుంది. శాశ్వత మిత్రులు, శత్రువులు లేరన్నట్టుగా కూటములు మార్చడంలోనూ ఆయన విలక్షణమే. ఇప్పుడు మరోమారు అదే పని చేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమికి గుడ్​బై చెప్పి.. మహాకూటమితో జట్టు కట్టారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాల మద్దతుతో సరికొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ఇన్నిసార్లు సీఎం అయినా.. 1989 తర్వాత నితీశ్​ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం విశేషం.

తొలిసారి ఎనిమిది రోజులే సీఎంగా..
నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఏడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఎందుకంటే శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.

ఎంపీగా ఆరుసార్లు..
1977లో నితీశ్‌ కుమార్‌ నలంద జిల్లాలోని హర్నాట్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1985లో అదే స్థానం నుంచి బరిలో దిగి రికార్డుస్థాయి మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 1985లోనే చివరిసారి. తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తనకు సరైన మెజార్టీ లేకపోవడంతో కేవలం ఎనిమిది రోజులకే (మార్చి 3 నుంచి 10 వరకు) రాజీనామా చేయాల్సి వచ్చింది.

నితీశ్ కుమార్

ఆ నిబంధన ప్రకారమే..
2005 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా- జేడీయూ కూటమి గెలుపొందింది. దీంతో నితీశ్‌ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు కూడా ఆయనకు ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 (4) సెక్షన్‌ ప్రకారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా శాసనమండలి)కు సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉంది. దీంతో 2006లో నితీశ్‌ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా - జేడీయూ కూటమి భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రాగా.. ఆయన‌ వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీ కాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు.

నైతిక బాధ్యతతో రాజీనామా..
అనంతరం 2013లో భాజపాతో ఉన్న స్నేహాన్ని తెంచుకొని దేశాన్ని ఆశ్చర్యపరిచారు నితీశ్. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగారు. మోదీ వేవ్‌ కారణంగా జేడీయూకి ఘోర పరాభవం ఎదురవ్వడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో అప్పట్లో జేడీయూలో ఉన్న జితిన్‌ రాం మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో జితిన్‌ రాం మాంఝీ జేడీయూ నుంచి బహిష్కరణకు గురవ్వడంతో నితీశ్‌ నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన‌ ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో తేజస్వీపై అవినీతి ఆరోపణలు రాగా.. నితీశ్‌ ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించారు. దీనికి ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం చెప్పగా 2017 జులైలో నితీశ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా కూటమి చీలిపోయింది. అనంతరం కొద్ది గంటల్లోనే బిహార్‌లోని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మళ్లీ ఎన్డీఏతో దోస్తీ కట్టిన నితీశ్‌ కొద్ది గంటల్లోనే మళ్లీ సీఎం పీఠం దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నితీశ్‌ పదవీ కాలం 2024 నాటికి పూర్తి కానుంది.

నితీశ్ కుమార్

ఈలోగా 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్​జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జేడీయూ. ఫలితంగా ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు నితీశ్ కుమార్. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు కూటమి మరోమారు విచ్ఛిన్నమైంది. జేడీయూ-ఆర్​జేడీ-కాంగ్రెస్​ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. నితీశ్​ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది 8వ సారి కానుంది.

అందుకే శాసనమండలి నుంచి..
Nitish Kumar MLA or MLC : ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు నితీశ్‌ భయపడుతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు పదేపదే విమర్శిస్తుంటారు. శాసనమండలి నుంచి ఎన్నికవ్వడమే ఆయన తనకు సురక్షితమని భావిస్తున్నారని అంటుంటారు. అయితే, ఇలాంటి విమర్శలకు గతంలో నితీశ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలనుకోవడంలేదని, అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంలేదని చెప్పుకొచ్చారు.

నితీశ్ కుమార్
Last Updated : Aug 9, 2022, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details