Newly Constructed Road Damaged in Alluri District: భూకంపం వచ్చి బీటలు వారిందా అన్నట్టుగా రహదారి చీలిపోయింది. సరిగ్గా అధ్యయనం చేయకుండా, తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోకుండా జరిగిన నిర్మాణానికి వరద వల్ల చెదిరిపోయిన రోడ్డే అద్దం పడుతోంది. సాధారణంగా కొత్తగా కొండకొనల్లో లూజు మట్టి ఉన్నప్పుడు అనుసరించాల్సిన ఇంజినీరింగ్ ప్రమాణాలు గాని, ఇతరత్రా జాగ్రత్తలు కాని కనీసస్థాయిలోనూ తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. కనీసం రహదారి లేకుండా బతుకులు నెట్టుకొస్తున్న.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల పంచాయతీ రంగబయలు, జోడిగుమ్మ, కొసంపుట్టు వంటి గ్రామాల ప్రజలకు రోడ్డు ధ్వంసం కావటంతో మళ్లీ కష్టాలు మొదటికొచ్చాయి.
పీఎంజీఎస్వై కింద ఆశరాడ నుంచి జోడిగుమ్మ వరకు మొత్తం 22 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 16 కోట్లు మంజూరు చేసి పక్కాగా నిర్మాణం చేపట్టారు. ఇటీవల రోడ్డు పనులు కొలిక్కి వచ్చాయి. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆశరాడ- జోడిగుమ్మ రహదారి మట్టిగుడ సమీపం నుంచి కొసంపుట్టు మార్గం మధ్యలో చాలాచోట్ల కోతకు గురైంది. దాదాపు మూడు కిలోమీటర్ల దారిలో రోడ్డు ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయింది. రహదారికి గండిపడి జోడిగుమ్మ, కొసంపుట్టు, ముండిగుడ, పట్నాపడాల్పుట్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దశాబ్దాలుగా రహదారి లేక నానా అవస్థలు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు.. రహదారి నిర్మాణం పూర్తి అయిందని సంబరపడుతున్న వేళ.. మొదటి వర్షానికే రహదారి మొత్తం దెబ్బతినడం నిశ్చేష్టులను చేసింది. డోలీ మోతలు తప్పాయి అనుకునేలోపే రహదారి కోతకు గురికావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.