కర్ణాటకలో నీలకురింజి పుష్పాల (neelakurinji flower) అందాలు మరోసారి యాత్రికులను పలకరిస్తున్నాయి. 12ఏళ్లకు ఓసారి వికసించే ఈ పూల సొయగాలను తనివితీరా చూసేందుకు కొడగు జిల్లాకు చేరుకుంటున్నారు ప్రకృతి ప్రేమికులు, వృక్ష శాస్త్రజ్ఞులు, ఫొటోగ్రాఫర్లు. మండల్పట్టి, కోటెబెట్టలోని కొండల్లో ఆవిష్కృతమైన ఈ అరుదైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు.
స్థానికంగా ఈ పూలను కురింజి అని అంటారు. ఓ వారం రోజుల పాటు ఇవి భూమిపై స్వర్గాన్ని తలపిస్తాయి. అయితే ఈ పూలలో ఒక జాతి ఒక్కో సమయంలో.. అంటే 5, 7, 12, 14 ఏళ్ల కాలావధిలో వికసిస్తాయి. అందుకే అవి విరబూసినప్పుడే తప్పక చూడాలని తరలివస్తుంటారు స్థానికులు, పర్యటకులు. ఆ అందాలను చూసి మైమరచిపోతుంటారు.