National anthem controversy lyrics: 1905లో చేసిన బెంగాల్ విభజనను 1911లో బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత ప్రజల ఆందోళనకు ఆంగ్లేయులు తలొగ్గి... మనసు మార్చుకున్న తొలి సంఘటన అది. అదే సమయంలో... బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-5 భారత పర్యటనకు రావటంతో... రెండింటినీ కలిపి... కృతజ్ఞత తెలపటానికి కాంగ్రెస్ పార్టీ కోల్కతాలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రెండు పాటల్ని ఆలపించారు. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ సంస్కృత-బెంగాలీ పదాలతో రాసిన జనగణమన. రెండోది... జార్జ్-5ను కీర్తిస్తూ... రాంభుజ్ చౌధరి రాసిన గేయం. అనంతరం... బ్రిటిష్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ సభ తీర్మానాన్ని ఆమోదించింది.
Azadi ka amrit mahotsav
మరుసటి రోజు... ఆంగ్లేయుల పక్షాన నిలిచే అప్పటి ఇంగ్లిష్ పత్రికల్లో... 'కింగ్ జార్జ్ను కీర్తిస్తూ రవీంద్రుడు రాసిన గేయాన్ని కాంగ్రెస్ సభలో ఆలపించారం'టూ రాయటంతో అయోమయం చోటుచేసుకుంది. దీన్ని రవీంద్రుడు తోసిపుచ్చినా వివాదం, విమర్శలు కొనసాగుతూనే వచ్చాయి. "ఇలాంటి విమర్శలకు జవాబు చెప్పటమంటే... నన్ను నేను దిగజార్చుకున్నట్లే. బ్రిటిష్ను కీర్తించే పిచ్చిపని నేనెలా చేస్తా?" అంటూ బాధపడ్డ ఠాగూర్... తర్వాత సంపాదకుడు పులిన్ బెహారికి రాసిన లేఖలో అసలేం జరిగిందో వివరించారు. బ్రిటిష్ రాజును కీర్తించే పిచ్చిపని తాను చేయలేనని రవీంద్రుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టీకరించారు.
1911 congress session jana gana mana
"బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే స్నేహితుడొకరు... బెంగాల్ విభజన రద్దుతో ఆనందం పట్టలేక... నా వద్దకు వచ్చి... కింగ్ జార్జ్ను కీర్తిస్తూ రాయమని కోరారు. అది నాకెంతో ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం తెప్పించింది. యుగయుగాలుగా జార్జ్-5, జార్జ్-6, జార్జ్-7... ఇలా ఎంతటి శక్తిగల రాజులు వచ్చినా మానవ విధాతలు కాలేరు. భారతావని భాగ్యచక్రాన్ని నడిపించే అధినాయకుడు ... అందరి శుభాలను కోరే వాడే తప్ప ఏ రాజూ కాడు... కాలేడు."