పుదుచ్చేరిలో భాజపా ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ సీఎం నారాయణ స్వామి. షా.. తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ స్వామి, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు షా. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధుల్లో రూ.15వేల కోట్ల సొమ్మును.. నారాయణ స్వామి అక్రమంగా గాంధీ కుటుంబానికి తరలించారని ఆరోపించారు.
"ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాల కింద రూ.15వేల కోట్లను పంపారని షా అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. షా వ్యాఖ్యలు.. నాతో పాటు గాంధీ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్నాయి. దీన్ని ఆయన రుజువు చేయాలి. అలా నిరూపించలేకపోతే ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయాల్సి ఉంటుంది."
- వి.నారాయణ స్వామి, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి