తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జల్​ శక్తి అభియాన్​: క్యాచ్​ ది రైన్​'కు నేడు మోదీ శ్రీకారం

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు 'జల్​ శక్తి అభియాన్​: క్యాచ్​ ది రైన్​​(వర్షపు నీటిని ఒడిసిపట్టు)' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది.

By

Published : Mar 22, 2021, 5:58 AM IST

Modi to launch 'Catch the Rain' campaign from Monday
'జల్​ శక్తి అభియాన్​: క్యాచ్​ ది రైన్​'కు నేడు మోదీ శ్రీకారం

'జల్​ శక్తి అభియాన్​- వర్షపు నీటిని ఒడిసిపట్టు(క్యాచ్​ ద రైన్​)' ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(సోమవారం) ప్రారంభించనున్నారు. ప్రపంచ జల దినం సందర్భంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా మార్చి 22 నుంచి నవంబర్​ 30 వరకు ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు.

ఇదే రోజున దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర నదీ జలాల అనుసంధానం ప్రణాళికకు అడుగులు పడనున్నాయి. కేన్​, బేట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు.

పడ్డచోటే ఒడిసిపట్టు..

'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 'ఎప్పుడు పడ్డా.. పడ్డచోటే వర్షపు నీటిని ఒడిసిపట్టు' అనే నినాదంతో ప్రచారాన్ని సాగించనున్నట్లు పేర్కొంది. మార్చి 22 నుంచి నవంబర్​ 30 మధ్య ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరూ పాలుపంచుకునేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. దేశమంతటా గ్రామసభలలో నీటి పరిరక్షణ అవగాహన సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది.

వాజ్​పేయీ సంకల్పానికి ఆరంభం..

దౌదన్​ ప్రాజెక్టు నిర్మించి కేన్​, బేట్వా నదులను అనుసంధానించనున్నారు. 10.62 లక్షల హెక్టార్ల భూమి దీనివల్ల సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.

కేన్​, బేట్వా నదుల అనుసంధానం దేశంలో నదుల అనుసంధానానికి తొలిమెట్టుగా ప్రధాని కార్యాలయం అభివర్ణించింది. జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి కరవు ఎదుర్కొనే ప్రాంతాలకు నీరందించాలనే మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇది ఆరంభం అని పేర్కొంది.

ఇదీ చూడండి:'హిరేన్​​ మృతి కేసు కథ ముగిసింది!'

ABOUT THE AUTHOR

...view details