తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 12:36 PM IST

ETV Bharat / bharat

Modi On 2024 Elections : '2024 ఎన్నికల్లో 100 కోట్ల ఓట్లు!.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ ఇదే..'

Modi On 2024 Elections : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 100 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగంచుకోనున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు భారత్​లో జరగనున్నాయని.. వాటిని చూసేందుకు రావాలని పీ20 ప్రతినిధులందరినీ మోదీ ఆహ్వానించారు.

Modi Speech Today
Modi Speech Today

Modi On 2024 Elections :దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 100 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగంచుకోనున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు భారత్​లో జరగనున్నట్లు చెప్పారు. తమ దేశంలో జరగనున్న ఈ ఎన్నికలను చూసేందుకు పీ20 ప్రతినిధులందరినీ మోదీ ఆహ్వానించారు. దిల్లీలో జరుగుతున్న జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"సార్వత్రిక ఎన్నికలను చూసేందుకు వచ్చే ఏడాది భారత్​ను సందర్శించాలని పీ20 ప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ ఎన్నికల్లో దేశంలోని 100 కోట్ల మంది ఓటర్లు.. ఓటు వేయనున్నారు. ఈవీఎంల వినియోగం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచింది. ఓట్ల లెక్కింపు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తున్నాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మా పార్టీని వరుసగా రెండోసారి గెలిపించారు. 2024లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు జరగనున్నాయి. భారత్​ ఇప్పటివరకు 17 సాధారణ ఎన్నికలు, 300 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించింది. భారతదేశ పార్లమెంటరీ పద్ధతులు కాలక్రమేణా అభివృద్ధి చెందాయి."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"భారతదేశం దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు వేలాది మంది అమాయకులను చంపేశారు. ఉగ్రవాదం ఎంతో పెద్ద సవాలు అని ప్రపంచం ఇప్పుడు గ్రహించింది. ఉగ్రవాదం ఎక్కడైనా, ఏ రూపంలో కనిపించినా మానవత్వానికి విరుద్ధం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరీయన్లు ఆలోచించాలి" అంటూ ఉగ్రవాదం గురించి మోదీ వ్యాఖ్యలు చేశారు.

"నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న విభేదాలు, ఘర్షణలు ఎవరికీ ప్రయోజనం కలిగించవు. విభజిత ప్రపంచం మానవాళి ముందున్న సవాళ్లకు పరిష్కారాలు చూపదు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం. కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే. ప్రపంచ విశ్వాసానికి అడ్డుగా ఉన్న అడ్డంకులను మనమే తొలగించుకోవాలి. మానవ-కేంద్రీకృత విధానంతో ముందుకు సాగాలి. ప్రపంచాన్ని ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనతో చూడాలి" అని ప్రధాన మోదీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details