తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​, అసోంలో ఈనెల 23న మోదీ పర్యటన - కోల్‌కతాకు మోదీ

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23న కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అసోంలో భూ పట్టాల పంపిణీ చేస్తారు.

Modi in Kolkata for Bose's birth anniversary celebrations, to also visit Assam
నేడు పశ్చిమ్ బంగా పర్యటనకు మోదీ

By

Published : Jan 22, 2021, 5:04 AM IST

Updated : Jan 22, 2021, 6:29 AM IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23న కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అనంతరం అసోంలోని శివసాగర్‌లో సుమారు లక్ష మందికి భూ కేటాయింపు ధ్రువీకరణ పత్రాలందించే కార్యక్రమం 'పట్టాస్'లో మోదీ పాల్గొంటారని వెల్లడించింది.

ఆజాద్‌ హిందు ఫౌజ్‌ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడికి నివాళిగా ప్రతి ఏటా జనవరి 23ను 'పరాక్రమ్ దివస్'‌గా జరపాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్య్ర సమరంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన 'నేతాజీ'​ ప్రతిభ యువతలో దేశభక్తిని రగిలిస్తుందని తెలిపింది.

వివిధ కార్యక్రమాలు..

కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో జరిగే 'పరాక్రమ్ దివస్' ప్రారంభ వేడుకలకు మోదీ అధ్యక్షత వహించనున్నారు. సుభాష్​ చంద్ర బోస్‌ జీవిత చరిత్రపై ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక నాణాన్ని, తపాలా బిళ్ళను విడుదల చేయనున్నారు. ఇక ఈ వేడుకల్లో బంగాలీ సాంస్కృతిక కార్యక్రమం 'అమ్రా నూతన్ జౌబొనెరి డూట్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇదీ చదవండి:మోదీ అధ్యక్షతన నేతాజీ​ 125వ జయంతి ఉత్సవాలు

ఈ కార్యక్రమానికి ముందు కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించనున్నారు మోదీ. అక్కడ నేతాజీ సుభాష్​ చంద్రబోస్​పై వెలువడిన 21వ శతాబ్దపు వారసత్వ పత్రాలను పరిశీలిస్తారు. అనంతరం కళాకారులతో సంభాషిస్తారని పీఎంఓ తెలిపింది.

ఇక బంగాల్​ పర్యటన అనంతరం అసోంలో 1.06 లక్షల మంది లబ్ధిదారులకు భూ పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. భూ హక్కుల పరిరక్షణకు సమగ్ర నూతన భూ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అసోంలో 2016 వరకు 5.75 లక్షల కుటుంబాలకు సొంత భూమి లేదు. ఇప్పటివరకూ 2.28 లక్షల భూమి పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్-మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'

Last Updated : Jan 22, 2021, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details