కేంద్ర మంత్రివర్గంలో నూతనంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని తెలుస్తోంది. కేంద్ర సహకార శాఖ పేరుతో నూతన మంత్రిత్వ శాఖను ప్రధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి.
'సహకారంతోనే సమృద్ధి' అనే విజన్ను సాక్షాత్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఈ శాఖకు కొత్త మంత్రిని బుధవారం నియమించే అవకాశం ఉంది.
"ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుంది. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి.. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుంది. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుంది."