Mobile Blast In Nashik :ఛార్జింగ్లో పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలడం వల్ల ఇంటి కిటికీలు, సామగ్రి ధ్వంసమయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం. కేవలం మొబైల్ ఫోన్ పేలుడుకే ఇంత పెద్దమొత్తంలో నష్టం వాటిల్లడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఇంట్లో నివాసం ఉంటున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
చుట్టుపక్కల ఇళ్లు కూడా..
తుషార్ జగ్తాప్, శోభా జగ్తాప్, బాలకృష్ణ సుతార్ కలిసి నాసిక్ ప్రతాప్నగర్లోని సిడ్కో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సెప్టెంబర్ 27న ఈ ముగ్గురిలో ఒకరు తమ మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టారు. ఉన్నట్టుండి బుధవారం ఉదయం ఛార్జింగ్ పెట్టిన ఫోన్ భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లోనే ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు గాయపడిన వారిని దగ్గర్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
జేబులో పేలిన కీప్యాడ్ ఫోన్!
ఇటీవలే కేరళలోని త్రిస్సూర్ నగరంలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వృద్ధుడి జేబులో ఉన్న కీ ప్యాడ్ ఫోన్ ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో అతడి షర్ట్కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వృద్ధుడు జేబులో నుంచి ఫోన్ను తీసి కిందకు విసిరేశాడు. అనంతరం మొబైల్కు అంటుకున్న మంటలను ఆర్పేశాడు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఇలియాస్ ఓ హోటల్లో టీ తాగుతూ కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి లైవ్ వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.