తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ... ఈనెల 16న మరోసారి రావాలని నోటీసులు - MLC Kavitha involved in delhi liquor policy

MLC Kavitha attends ED inquiry : మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 8 గంటలుగా ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికి వరకు లభ్యమైన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాల మేరకు కవితను విచారించారు. ఈ నేపథ్యంలోనే దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

5 గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఏం జరగనుంది..?
5 గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఏం జరగనుంది..?

By

Published : Mar 11, 2023, 10:59 AM IST

Updated : Mar 11, 2023, 8:23 PM IST

MLC Kavitha attends ED inquiry : దేశంలో రెండేళ్లుగా ప్రకంపనలు రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ, సీబీఐ.. పలు రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను వెలుగులోకి తేవటంతో పాటు హైదరాబాద్‌ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ సుమారు 8 గంటల పాటు విచారించారు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చిన కవిత నేరుగా దిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. మరోవైపు కవితను ఈనెల 16 న మరోసారి విచారణకు రావాలని కవిత నోటీసులు జారీచేసింది.

వాస్తవానికి ఈ నెల 9నే విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేసినా.. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రెండ్రోజుల తర్వాత హాజరవుతానని కవిత ఈడీకి లేఖ రాసింది. ఈ మేరకు 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే హైదరాబాద్‌ నుంచి దిల్లీకి చేరుకున్న ఆమె.. మహిళా రిజర్వేషన్లపై శుక్రవారం దీక్ష చేపట్టారు. మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రశ్నించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీలు, ఇతర నేతలు ఒకరోజు ముందుగానే దిల్లీకి వెళ్లారు. ఇవాళ విచారణ ఉన్నందున ఉదయం నుంచి దిల్లీలోని కేసీఆర్‌ నివాసం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

దిల్లీలో కవిత ఉన్న తుగ్లక్‌రోడ్‌లోని కేసీఆర్‌ నివాసం వద్దకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. ఉదయం ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో కవిత సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. అనంతరం, నివాసం నుంచి 10 వాహనాల కాన్వాయ్‌లో బయలుదేరిన కవిత.. తన పిడికిలి బిగించి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేశారు. అనంతరం భర్త అనిల్‌, న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఉదయం 11 గంటల తర్వాత ఈడీ కార్యాలయంలోకి కవిత వెళ్లారు. దాదాపుగా 8 గంటలుగా మద్యం కుంభకోణానికి సంబంధించి పలు అంశాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కవిత విచారణ సందర్భంగా రాజకీయ వర్గాల్లో, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈడీ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా దిల్లీ పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Last Updated : Mar 11, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details