తెలంగాణ

telangana

Assam-Mizoram Dispute: అసోం-మిజోరం మధ్య మళ్లీ రగడ

By

Published : Aug 23, 2021, 7:10 AM IST

సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ (Border issue between Assam and Mizoram).. అసోం పోలీసులపై మిజోరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు అసోం పోలీసులు చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలతో కావడం గమనార్హం.

Mizoram Assam border issue
మిజోరం అసోం సరిహద్దు వివాదం

అసోం-మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో(Assam Mizoram border dispute) వివాదం మళ్లీ రాజుకుంటోంది. మిజోరం ఓ చోట వంతెన నిర్మాణం చేపట్టగా.. అది తమ భూభాగమంటూ అసోం పోలీసులు(Assam police) పనులను అడ్డుకున్నారు. దీంతో వారిపై మిజోరం పోలీసులు 'దొంగతనం' కేసు నమోదు చేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం వంటి పరిణామాలతో వ్యవహారం ముదురుతోంది.

అది మా భూభాగం: అసోం

మిజోరం అధికారులు తమ భూభాగమైన హైలకండిలోకి అక్రమంగా ప్రవేశించి వంతెన నిర్మాణం ప్రారంభించారని అసోం ప్రభుత్వం (Assam Mizoram border dispute) ఆదివారం ఆరోపించింది. రామ్‌నాథ్‌పుర్‌ పోలీసు ఠాణా పరిధిలోని కచుర్తాల్‌ వద్ద మిజోరం నుంచి వచ్చిన కొంతమంది కార్మికులు వంతెన నిర్మాణానికి ప్రయత్నించినట్లు హైలకండి ఎస్పీ గౌరవ్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న రామ్‌నాథ్‌పుర్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు చెప్పారు. దాదాపు 40-50 మంది భద్రత సిబ్బంది మిజోరం నుంచి వచ్చారని, వారిలో కొందరు ఆసోం వైపు చొచ్చుకు వచ్చారని ఆరోపించారు. వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరినప్పటికీ నిరాకరించినట్లు చెప్పారు. "ఈ చర్య సరిహద్దు వద్ద శాంతిని నెలకొల్పేందుకు రెండు రాష్ట్రాలూ సంయుక్తంగా ఈనెల 5న చేసిన ప్రకటనను పూర్తిగా ఉల్లంఘించేలా ఉంది" అని పేర్కొన్నారు. దీంతో తన నేతృత్వంలో దాదాపు 200 మంది పోలీసులు ఆదివారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు.

అసోం పోలీసులు చోరీ చేశారు..

మరోవైపు వంతెన ప్రాంతం తమ భూభాగంలోనే ఉందని.. అసోం పోలీసులు వచ్చి నిర్మాణ సామగ్రిని చోరీ చేశారని మిజోరం అధికారులు ఆరోపించారు. ఈమేరకు అసోం పోలీసులపై కేసు కూడా నమోదు చేశారు. తమ భూభాగంలోని బైరబి పట్టణానికి సమీపంలోని జోఫై వద్ద వంతెన నిర్మిస్తున్నట్లు మిజోరం కోలసిబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌.లాల్‌త్లంగ్లియానా తెలిపారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సీ ఛుంగాకు చెందిన పొలాన్ని ప్రధాన రహదారికి అనుసంధానించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టగా అసోం పోలీసులు వచ్చి ఇనుప రాడ్లు వంటి నిర్మాణ సామగ్రిని ఎత్తుకు పోయారని ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని హైలకండి డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ వంతెన నిర్మాణానికి సరిహద్దు అంశానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదంలో బైరబిలోని జోఫై ప్రాంతమే కీలకమైంది. 2018 మార్చిలో ఈ ప్రాంతంలో హింస కూడా చోటుచేసుకుంది. మిజోరంలోని అయిజోల్‌, కోలాసిబ్‌, మమిత్‌ జిల్లాలు అసోంలోని హైలకండి, కచార్‌, కరీంగంజ్‌ జిల్లాల మధ్య దాదాపు 164.6 కి.మీ.ల మేర సరిహద్దు ఉంది.

హైలకండి డిప్యూటీ కమిషనర్​కు రాసిన లేఖ

ఇదీ చదవండి:Afghan crisis: 'భారత్ మాకు​ రెండో ఇల్లు'.. అఫ్గానీల ఆనందబాష్పాలు

ABOUT THE AUTHOR

...view details