తెలంగాణ

telangana

'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్​.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'

By

Published : Jul 7, 2022, 5:24 PM IST

Mahua Moitra Comment: కాళీమాతపై తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా దీని గురించి స్పందించారు. మనుషులు తప్పులు చేస్తారని.. కానీ వాటిని సరిదిద్దుకోవచ్చని ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మరోవైపు.. మొయిత్రాపై మధ్యప్రదేశ్​ భోపాల్​లో కేసు నమోదైంది.

'Mistakes can be rectified', says Mamata as Mahua Moitra faces FIR over 'Kali' remark
'Mistakes can be rectified', says Mamata as Mahua Moitra faces FIR over 'Kali' remark

Mahua Moitra Comment: కాళీమాతను మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ఆమెను అరెస్టు చేయాలని భాజపా డిమాండ్​ చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మనుషులు తప్పులు చేస్తారని.. వాటిని సరిదిద్దుకోవచ్చని మాట్లాడారు. కోల్​కతాలో విద్యార్థులకు క్రెడిట్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

''మనుషులు తప్పులు చేస్తారు.. కానీ వాటిని సరిదిద్దుకోవచ్చు. మేం కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

మహువాను టీఎంసీ నుంచి సస్పెండ్​ చేయాలని భాజపా నేతలు తృణమూల్​ కాంగ్రెస్​కు సూచించారు. దీంతో.. కాళీపై మొయిత్రా వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ఆమె బుధవారం అన్‌ఫాలో చేశారు. కానీ.. దీదీ ట్విట్టర్​ అకౌంట్​ను మాత్రం అనుసరిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో త్వరలోనే మొయిత్రా తృణమూల్‌ను వీడవచ్చని పలువురు విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలోనే దీదీ పైవ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు భాజపా విమర్శల నేపథ్యంలో ఆ పార్టీకి సవాల్​ విసిరారు మహువా. తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నిరూపించాలని ఛాలెంజ్​ చేశారు. గూండాలకు, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను సత్యాలు మాట్లాడుతున్నా అని.. సత్యానికి ఎలాంటి బ్యాకప్​ శక్తులు అవసరం లేదని అన్నారు.
ఎంపీ మహువా వ్యాఖ్యలను.. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. కాళీమాతపై ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ దేవతలను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మహువాపై మధ్యప్రదేశ్​ భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

'కాళీ పోస్టర్​'పై స్పందించి..
దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజాచిత్రం 'కాళీ'కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదమైంది. కాళీ పాత్రధారి స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన జెండాను చేతబూని, సిగరెట్‌ కాల్చుతూ ఉన్న దృశ్యం ఆ పోస్టర్‌లో ఉంచారు. మంగళవారం ఓ చర్చా కార్యక్రమంలో దీనిపై మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. తాను ఏ చిత్రానికీ, ఏ పోస్టర్‌కూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలు వాడనేలేదని వివరణ ఇచ్చారు.

ఇవీ చూడండి:టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై? అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్​!

'కాళీ' దర్శకురాలి పోస్టుపై ట్విట్టర్‌ కొరడా.. కెనడా మ్యూజియం క్షమాపణలు

ABOUT THE AUTHOR

...view details