కరోనా వైరస్ విశృంఖల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన; ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా వర్గీకరించి కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయాప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది.
ఇవే మార్గదర్శకాలు
- అత్యవసరం కాని కార్యకలాపాలను రాత్రిపూట పూర్తిగా నిషేధించాలి.
- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత, ఉత్సవ సంబంధమైన సమూహాలు, సమావేశాలను నిషేధించాలి. అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్లు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన స్థలాలు పూర్తిగా మూసేయాలి.
- వివాహాలకు 50 మంది వరకు, అంత్యక్రియలు/కర్మకాండలకు 20 మంది వరకు మాత్రమే అనుమతివ్వాలి.
- ప్రజా రవాణా (రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, క్యాబ్లు) గరిష్ఠంగా 50% సామర్థ్యంతోనే నడవాలి. రాష్ట్రాల్లో అంతర్గతంగా లేదా రాష్ట్రాల మధ్య రాకపోకలపైనా.. అత్యవసర సరకుల రవాణాపైనా ఆంక్షలొద్దు.
- వైద్య, పోలీసు, అగ్నిమాపక సేవలు, బ్యాంకులు, విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య సేవలు కొనసాగడానికి అవకాశం కల్పించాలి.
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ గరిష్ఠంగా 50% సామర్థ్యంతో పనిచేయాలి. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు 10% పాజిటివిటీ మించిన ప్రాంతాలన్నింటినీ ఇందులోకి తీసుకొచ్చి కట్టడి చర్యలు చేపట్టాలి. ఈ ఆంక్షలను 14 రోజులపాటు కొనసాగించాలి. ఏదైనా ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ ప్రాంతంగా ప్రకటించే ముందు బహిరంగంగా వెల్లడించాలి. కొవిడ్ నిబంధనలు (మాస్క్, చేతుల శుభ్రత, భౌతికదూరం) అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
కట్టడిలో సమాజ సేవలు ఉపయోగించుకోవాలి