Online Gambling Fraud Nagpur : ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టుబడుల ఆశ చూపి మహారాష్ట్రలో ఓ వ్యాపారవేత్తను నిండా ముంచేశాడు ఓ బుకీ. దాదాపు రూ. 58 కోట్ల మేర మోసం చేశాడు. దీంతో బాధితుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నాగ్పుర్కు చెందిన ఓ వ్యాపారవేత్తకు గోందియా జిల్లాకు చెందిన అనంత్ నవరతన్ జైన్తో పరిచయం ఏర్పడింది. ఆన్లైన్ జూదం ద్వారా స్వల్ప వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని వ్యాపారిని నమ్మించాడు నిందితుడు అనంత్. అనంతరం బాధితుడికి వాట్సాప్లో ఆన్లైన్ జూదం లింక్లు పంపించి ఆడించాడు. క్రమంగా ఆన్లైన్ జూదానికి అలవాటు పడేలా చేశాడు. అయితే, మొదటి సందేహించిన వ్యాపారి.. ఆ తర్వాత రూ. 8 లక్షలు నిందితుడికి పంపించి.. ఆన్లైన్ జూదం ఆడటం ప్రారంభించాడు.
మొదటలో రూ. 5 కోట్లు గెలిచాడు. దీంతో అనంత్ను పూర్తిగా నమ్మాడు వ్యాపారి. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పు చేసి మరీ జూదం ఆడాడు. కానీ ఆ తర్వాత నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. నవంబర్ 2021 నుంచి ఇప్పటివరకు రకరకాల జూదాలు ఆడి.. ఏకంగా దాదాపు రూ. 58.42 కోట్ల వరకు నష్టపోయాడు. అయితే, నిందితుడు ప్రణాళిక ప్రకారం తప్పుడు లింక్లు పంపించి బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు
అయితే, ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు.. తన డబ్బు వాపస్ ఇవ్వాలని నవరతన్ను అడిగాడు. దీనికి నిందితుడు జైన్ నిరాకరించాడు. అంతేకాకుండా తనకే తిరిగి రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. అనరంతం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో నాగ్పుర్ పోలీసులు కాకా చౌక్లోని బుకీ నివాసంపై దాడి చేశారు. 17 కోట్లకు పైగా నగదు, సుమారు 4 కిలోల బంగారం, 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే.. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.