పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ పోస్ట్ చేసిన 'టూల్కిట్' కేసులో ఓ విదేశీయుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పీటర్ ఫ్రీడ్రిక్ అనే వ్యక్తి టూల్కిట్ వ్యవహారంలో రిసోర్స్ పర్సన్గా ఉన్నట్లు డిస్ఇన్ఫోల్యాబ్ తన నివేదికలో వెల్లడించింది. 'భారత్కు వ్యతిరేకంగా సమాచార యుద్ధం' పేరిట జరిగే ఓపెన్ సోర్స్ ఇన్వెస్టిగేషన్లోనూ ఇతని పేరు కీలకంగా ఉందని తేలింది.
పీటర్కు ఖలిస్థానీ సంస్థలతో పాటు, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని డిస్ఇన్ఫోల్యాబ్ నివేదిక పేర్కొంది. 1990లో ఐఎస్ఐతో కలిసి భారత్పై దాడి చేసే ప్రణాళికలతో అతడికి లింకులు ఉన్నాయని తెలిపింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థానీ నెట్వర్క్ ద్వారా భారతీయలు, భారతీయ అమెరికన్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేశారని వెల్లడించింది.
"మేం నెలరోజుల నుంచి 'ఇన్ఫో-వార్ అగెయినిస్ట్ ఇండియా'పై దృష్టిసారించాం. ఇందులో కీలకమైన ఒక వ్యక్తి పేరు థన్బర్గ్ పొరపాటున పోస్ట్ చేసిన టూల్కిట్లోనూ కనిపించింది. ఆ విదేశీ నిపుణుడిని రిసోర్స్ పాయింట్గా టూల్కిట్లో పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరు పీటర్ ఫ్రీడ్రిక్. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం."
-డిస్ఇన్ఫోల్యాబ్
భారత్లో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఖలిస్థాన్ మద్దతుదారుడు భజన్ సింగ్ భిందర్.. ఆర్థికంగా కుంగిపోయిన పీటర్ ఫ్రీడ్రిక్తో జట్టుకట్టాడని డిస్ఇన్పోల్యాబ్ పేర్కొంది. క్రిస్టియన్ మిషనరీగా ఉన్న పీటర్.. అప్పటి నుంచి గాంధీ వ్యతిరేక భావజాలంతో పనిచేశాడని తెలిపింది. ఫ్రీడ్రిక్కు విశ్వసనీయత కల్పించేందుకు అమెరికాలో అనేక సంస్థలు ఏర్పాటైనట్లు వివరించింది. 2007లో నెలకొల్పిన ఆర్గనైజేషన్ ఫర్ ఇండియన్ మైనారిటీస్(ఓఎఫ్ఎంఐ) ఇందులో ప్రధానమైనదని వెల్లడించింది. భారత్లోని మైనారిటీల కోసం ఏర్పాటైన ఈ సంస్థలో ఒక్క భారతీయుడు గానీ, భారత సంతతి మైనారిటీలు గానీ లేరని పేర్కొంది. సిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎస్ఐసీ) పేరుతో ఏర్పాటైన సంస్థలోనూ పీటర్కు సముచిత స్థానం కల్పించారని తెలిపింది. ఇది ఖలిస్థానీ అజెండాలపై పనిచేస్తోందని వెల్లడించింది.
మోదీ ప్రభుత్వం సృష్టి: పీటర్
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను పీటర్ ఫ్రీడ్రిక్ ఖండించారు. ఈ వ్యవహారం అంతా మోదీ ప్రభుత్వం కావాలనే సృష్టిస్తోందని ఆరోపించారు. ఆరెస్సెస్-భాజపా చేస్తున్న నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అభూతకల్పన చేసి నేరాలన్నీ వాటిపై మోపుతున్నారని ట్వీట్ చేశారు.