మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం విన్నవించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీ) జాబితాను ప్రకటించకుండా రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగంలోని 102వ సవరణ ఏ మాత్రం అడ్డుకోవడం లేదని వివరించారు. ఈ సవరణ చట్టం 388బి, 342ఎ అనే రెండు అధికరణాలను జోడించింది. జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం విధులు, అధికారాలను 338బి పేర్కొంటోంది. ఒక నిర్దిష్ట కులాన్ని ఎస్ఈబీసీగా నోటిఫై చేసేందుకు రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని, సదరు జాబితాలో మార్పులు చేసేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను 342ఏ ప్రస్తావిస్తోంది.
మరాఠాలకు కోటా కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మరాఠాలకు కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర తెచ్చిన ఎస్ఈబీసీ చట్టం- 2018 రాజ్యాంగబద్ధమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ అంశంలో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ చేసిన వాదనలను కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలుగానే పరిగణించాలని కోరారు. ఎస్ఈబీసీలను నిర్ధరిస్తూ చట్టాన్ని చేసేందుకు రాష్ట్రాలకు ఉన్న హక్కులను 102వ రాజ్యాంగ సవరణ హరించడం లేదని ఈ నెల 18న అటార్నీ జనరల్.. కోర్టుకు విన్నవించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఆ అధికరణానికి స్పష్టత లేదు'