తెలంగాణ

telangana

By

Published : May 18, 2021, 3:25 PM IST

ETV Bharat / bharat

గవర్నర్​ను తొలగించాలని రాష్ట్రపతికి మమత లేఖ

బంగాల్​కు కొత్త గవర్నర్​ను నియమించాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రస్తుత గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​.. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నారదా కేసులో తృణమూల్​ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో.. మమత లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Mamata wants change of governor,
మోదీకి మమత లేఖ

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే ప్రస్తుత గవర్నర్​ను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు మమత. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి గవర్నర్​ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, హింసను పెంచి చూపిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

'' ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర శాంతిభద్రతల సమస్యను లేవనెత్తి గవర్నర్​ హద్దులు మీరారు. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై ప్రశ్నించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము చూస్తుంటే.. గవర్నర్​ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నారు.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని, కరోనా కట్టడిలో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యిందని తెలిపారు.

తోసిపుచ్చిన రాజ్​భవన్​

తృణమూల్​ కాంగ్రెస్​ ఆరోపణల్ని రాజ్​భవన్​ వర్గాలు ఖండించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడే గవర్నర్​ ప్రశ్నించారని తెలిపాయి. నారదా కుంభకోణంలో భాగస్వాములైన వారిపై సీబీఐ విచారణకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నాయి.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటినుంచి మమత ప్రభుత్వంపై మాటల దాడి పెంచారు ధన్​కర్​. పోలింగ్​ సమయంలో హింసాత్మక ఘటనలు జరిగిన సీతల్​ కుచి, నందిగ్రామ్​ ప్రాంతాల్లోనూ పర్యటించి దీదీ సర్కార్​ను ప్రశ్నించారు. అంతకుముందు కూడా మమత, ధన్​కర్​ మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.

నారదా కుంభకోణం కేసులో.. ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మేల్యే సహా మాజీ మంత్రిని సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో.. మమత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: 'హింసాత్మక ఘటనలతో బంగాల్​ ప్రజలు సతమతం'

ABOUT THE AUTHOR

...view details