తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ బం'గోల్'- 213 స్థానాల్లో టీఎంసీ పాగా

మమతా బెనర్జీ నేతృత్వంలోనీ టీఎంసీ తీన్మార్ మోగించింది. భారీ ఆధిక్యంతో బంగాల్​లో విజయకేతనం ఎగురవేసింది. అత్త-అల్లుళ్ల ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న భాజపా ఆశలు నెరవేరలేదు.

By

Published : May 3, 2021, 5:30 AM IST

mamata banerjee's tmc land slide victory in assembly elections victory in 215 seats
దీదీ బెం'గోల్'- 2015 స్థానాల్లో టీఎంసీ పాగా

ఎన్నికల పండితుల అంచనాలను తోసిరాజని.. భారీ ఆధిక్యంతో టీఎంసీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన 209 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుని సత్తాచాటింది. వంగభూమిలో తనకు తిరుగులేదని ముచ్చటగా మూడోసారి నిరూపించుకుంది. ఇదేదో కొన్ని పార్టీల మధ్య జరిగిన పోరులా కాకుండా.. మోదీ-మమతల మధ్య మల్లయుద్ధాన్ని తలపించింది. కాలికి గాయమైన మమత చక్రాలకుర్చీలోనే ప్రచారం చేశారు.

రెండుచోట్ల జరగని ఎన్నిక

294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బంగాల్‌లో.. రెండుచోట్ల అభ్యర్థులు కొవిడ్‌ కారణంగా మరణించడంతో 292 స్థానాల్లోనే 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. టీఎంసీ 213 చోట్ల గెలిచింది. భాజపా 75 చోట్ల గెలిచి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్ష కూటమి 1, ఇతరులు 1 స్థానాల్లో గెలిచారు. ఇంత భారీ విజయం సాధించినా, కొవిడ్‌తో పోరాడాల్సి ఉన్నందున సంబరాలు వద్దని మమత తమ పార్టీశ్రేణులకు సూచించారు.

ఆశా.. నిరాశేనా

'అత్తా అల్లుళ్ల' ప్రభుత్వాన్ని కూలదోసి వంగభూమిపై కాషాయజెండా ఎగరేయాలన్న భాజపా అగ్రనేతల ఆశలు... ఆదివారం నాటి ఫలితాలతో అడియాసలయ్యాయి. 2016లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి గణనీయంగా పుంజుకొని దాదాపు 76 స్థానాలను గెలుచుకోవడం పెద్ద విజయమే అయినా... వాళ్ల లక్ష్యం నెరవేరలేదు. మథువాల నుంచి మద్దతు, వామపక్షాలు-కాంగ్రెస్‌ కూటమి చతికిలబడటంతో భాజపాకు కాస్త గౌరవప్రదమైన సంఖ్య వచ్చింది.

కామ్రేడ్లకు శూన్యం

ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖీ స్థాపించిన ఐఎస్‌ఎఫ్‌తో జతకట్టిన సీపీఎం, కాంగ్రెస్‌... సంయుక్త మోర్చా పేరుతో మూకుమ్మడిగా బరిలోకి దిగాయి. 294 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో వామపక్షాలు 171 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్‌ 91, ఐఎస్‌ఎఫ్‌ 26 స్థానాల్లో బరిలోకి దిగాయి. కనీసం ఒక్క సీటైనా గెలవలేకపోయాయి.

దేశాన్ని బంగాల్‌ రక్షించింది: మమత

బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపును ప్రజాస్వామ్య విజయంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకి మమతా బెనర్జీ అభివర్ణించారు. తాజా తీర్పుతో భారత్‌ను బంగాల్‌ రక్షించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆదివారం మమత విలేకర్లతో మాట్లాడారు. విశేషాలు ఆమె మాటల్లోనే..

అనేక ప్రతికూలతలను అధిగమించాం

'ఇది బంగాల్‌ ప్రజల గెలుపు. ఈ తీర్పు ద్వారా భారత్‌ను, మత సామరస్యాన్ని రాష్ట్రం రక్షించింది. అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. 200 సీట్లు గెల్చుకుంటామని భాజపా నేతలు చెప్పుకొన్నారు. ఇప్పుడు వారు ముఖం చూపించగలరా?

221 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నా..

మోదీ, అమిత్‌ షా ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం గురించి ప్రచారంలో మాట్లాడారు. ఎన్నికల్లో మా పార్టీ ‘డబుల్‌ సెంచరీ’ కొట్టింది. ఇది 2021వ సంవత్సరం. అందుకే నేను 221 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ మార్కుకు చేరువగా వచ్చాం.

ఈసీ తీరు బాలేదు

ఈసీ ఎన్నికలను నిర్వహించిన తీరు బాలేదు. మా పార్టీ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఈసీపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయిస్తాం.

నందిగ్రామ్‌లో ఏదో తేడా జరిగింది

నందిగ్రామ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. కానీ, అక్కడ ఏదో తేడా జరిగినట్లు అనిపిస్తోంది. నేను గెలిచినట్లు తొలుత వార్తలొచ్చాయి. తర్వాత ఫలితం మారింది. దానిపై తర్వాత కోర్టును ఆశ్రయిస్తా.

టీకా ఉచితంగా వేయాల్సిందే

భారతీయులందరికీ ఉచితంగా కరోనా టీకా అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉచిత టీకా డిమాండ్‌ను కేంద్రం నెరవేర్చకపోతే నేను ధర్నాకు కూర్చుంటా. నేను బాగున్నా. గాయం నుంచి కోలుకున్నానని, కాలికి ఉన్న ప్లాస్టర్‌ తీసేస్తానని కొద్దిరోజుల క్రితం చెప్పాను' అని మమత గుర్తు చేశారు.

తానోడి.. పార్టీని గెలిపించి

అక్కడ పోటీ చేస్తున్నది ఆషామాషీ అభ్యర్థి కాదు. ఒకప్పుడు తనకు కుడిభుజం, జంగల్‌మహల్‌ ప్రాంతంలోని దాదాపు 65-70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి ప్రభావం చూపగల సువేందు అధికారి. నందిగ్రామ్‌లో ఆయనతో తలపడి గెలవడం అంత సులభం కాదని ఆమెకు తెలుసు. అయినా.. సవాలు చేసి మరీ ఆ ఒక్క స్థానాన్నే మమతా బెనర్జీ ఎంచుకున్నారు. ఒకవేళ తాను అక్కడ గెలవలేకపోయినా... భాజపాను ఓడించడానికి అదే సరైన వ్యూహమని భావించారు. మమత రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటం వల్ల సువేందు అధికారి, ఆయన కుటుంబం మొత్తం నందిగ్రామ్‌ మీదే దృష్టిసారించింది. అక్కడ వేరే అభ్యర్థి ఎవరున్నా... వారంతా కలిసి జంగల్‌మహల్‌ ప్రాంతంలో కాషాయ జెండా ఎగరేయించేవారు. ఆ ప్రాంతంలోనే 65-70 స్థానాలు గెలిచి, మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా బలం పుంజుకున్నా భాజపా దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయికి దగ్గరగా చేరగలిగేది. కానీ సాక్షాత్తు మమతే బరిలో ఉండటంతో జంగల్‌మహల్‌ ప్రాంతంలో ‘అధికారి’ కుటుంబ ప్రభావం అంతగా కనిపించలేదు. అది టీఎంసీకి బాగా కలిసొచ్చి.. 2016 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. మమత మాత్రం గట్టి పోటీ ఇచ్చినా... అనూహ్యంగా అధికారి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సాక్షాత్తు ప్రధాని, కేంద్ర హోం మంత్రి, భాజపా జాతీయాధ్యక్షుడు, అగ్రనేతలు అందరూ మోహరించినా తమ పార్టీకి 2016 కంటే మరింత ఆధిక్యాన్ని కట్టబెట్టి టీఎంసీ జెండాను సగర్వంగా ఎగరేశారు.

ఎక్కడి నుంచి మమత పోటీ?

నందిగ్రామ్‌లో పరాజయం పాలైనప్పటికీ తృణమూల్‌ అధినాయకి మమతా బెనర్జీ బెంగాల్‌ సీఎం పీఠమెక్కనున్నారు. అక్కడ శాసన మండలి లేకపోవడంతో.. పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఆమె తప్పనిసరిగా రాష్ట్రంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు సీట్లపై అందరి దృష్టి నెలకొంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి గత నెల 22న పోలింగ్‌ జరిగింది. అక్కడ తృణమూల్‌ తరఫున పోటీ చేసిన కాజల్‌ సిన్హా గెలుపొందారు. అయితే కొవిడ్‌ దెబ్బకు సిన్హా గత నెల 25నే మృతిచెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి. మరోవైపు- ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూయడంతో శంషేర్‌గంజ్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్నుంచి మమత పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:'నేను లోకల్​' నినాదంతో మమత తీన్మార్​

ABOUT THE AUTHOR

...view details